హైదరాబాద్లోని బేగం బజార్లో నిన్న చోటు చేసుకున్న పరువు హత్యను పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నీర్జ్ అనే యువకుడు సంజన అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో కక్షగట్టిన సంజన సోదరులు, తమ స్నేహితులతో కలిసి నీరజ్పై దాడి చేసి హతమార్చారు. అయితే.. ఎన్టీవీతో సంజన తల్లి మాట్లాడుతూ.. నా కూతురు సంసారాన్ని నాశనం చేశారని, హత్య చేసిన వాళ్లని ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు.
అంతేకాకుండా నీరజ్ హత్యలో మా కుటుంబ ప్రమేయం లేదన్న సంజన్న తల్లి.. గత ఆరు నెలలుగా నా కూతురిని, అల్లుడిని చంపుతామని కొందరు బెదిరించారని ఆమె వెల్లడించింది.వాళ్లు ఎవరనేది తెలియదని, హత్య జరిగిన సమయంలో నా కుమారుడు రితేష్, బావ కుమారులు నలుగురు ఇంట్లోనే ఉన్నారని ఆమె పేర్కొంది. హత్యతో వాళ్లకి ఎలాంటి సంబంధం లేదని, హత్య జరిగిన విషయం తెలుసుకొని భయపడి ఇంట్లో నుంచి పారిపోయారని ఆమె తెలిపారు.
అనంతరం సంజన సోదరి మమత మాట్లాడుతూ.. ఏడాదిగా మా సోదరి సంజనతో మా కుటుంబానికి మాటలు లేవని, మా అమ్మ ఆరోగ్యం బాగా లేకపోవడంతో రెండు నెలలుగా సంజన నాతో ఫోన్లో మాట్లాడుతుందని మమత వివరించింది. ప్రేమ వివాహం ఇష్టం లేకే ఆమెని దూరం పెట్టామని, భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని మేము కోరుకున్నామని, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదని మమత పేర్కొంది. హత్యతో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేసింది.
