Site icon NTV Telugu

Telangana: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఆ నిధులు వాపస్..

తెలంగాణలో డ్వాక్రా మ‌హిళ‌ల‌కు త్వర‌లోనే అభ‌య హ‌స్తం నిధులు వాపస్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం… కొద్ది రోజుల్లోనే మ‌హిళ‌ల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు.. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అసెంబ్లీలో స‌మావేశ‌మైన మంత్రులు హరీష్‌రావు, ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, మ‌ల్లారెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.. రాష్ట్రంలోని డ్వాక్రా మ‌హిళ‌లు పొదుపు చేసుకున్న అభ‌య హ‌స్తం నిధుల‌ను ఆ మ‌హిళ‌ల‌కు తిరిగి ఇవ్వాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 21 లక్షల మంది డ్వాక్రా సంఘాల మ‌హిళ‌లు రూ.545 కోట్ల రూపాయ‌ల‌ను పొదుపు చేసుకున్నారు.

Read Also: IPL: ఆర్‌సీబీకి కొత్త కెప్టెన్‌… వెల్లడించిన కోహ్లీ

అప్పట్లో అభయ హస్తం కింద రూ.500 కంట్రిబ్యూటరీ పెన్షన్ కోసం ఈ పొదుపు జరిగింది. అయితే, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక, ఆసరా పథకం కింద మొదట్లో వెయ్యి రూపాయలు, ఇప్పుడు రూ.2016 మొత్తాన్ని పెన్షన్‌గా ఇస్తోంది.. అప్పటి కంటే ఇప్పుడు అధిక మొత్తంలో పెన్షన్ వస్తున్నందున మహిళలు సైతం అభయ హస్తం డబ్బులు తమవి తమకు కావాలని అడుగుతున్నారు. ఇక, పొదుపు మహిళల కోరిక మేరకు ఆ నిధులను వారికి తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది సర్కార్.. ఈ నిధులు సంబంధిత పేదరిక నిర్మూలన సంస్థ వద్దే ఉన్నాయి. త్వరలోనే డ్వాక్రా మహిళల ఖాతాల్లో ఆ సొమ్మును జమ చేయనున్నారు.

Exit mobile version