NTV Telugu Site icon

తెలంగాణలో మరో భారీ పెట్టుబడి.. 25 వేల మందికి ఉద్యోగాలు..!

ktr

ktr

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది.. ఈ సారి ఎల‌క్ర్టానిక్ వాహ‌న రంగంలో రూ. 2,100 కోట్ల పెట్టుబ‌డి పెట్టేందుకు సిద్ధమైంది ట్రైటాన్ ఈవీ.. జ‌హీరాబాద్ నిమ్జ్‌లో యూనిట్ ఏర్పాటు చేయనుంది ట్రైటాన్ ఈవీ.. దీంతో.. దాదాపు 25 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.. మొదటి ఐదేళ్లలోనే సుమారు 50 వేల ఎలక్ట్రిక్‌ వాహనాలను ఉత్పత్తి చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా ట్రైటాన్ ఈవీ సంస్థ‌కు ధన్యవాదాలు తెలిపారు రాష్ర్ట ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి కేటీఆర్.. ఈ పెట్టుబడితో దేశంలోనే ఎలక్ట్రిక్ వాహన రంగ తయారీకి తెలంగాణ కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేటీఆర్.. కంపెనీ ప్రతిపాదిస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా భారీ ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలను ఈ రాష్ర్టంలో ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని, కంపెనీ పేర్కొన్న ప్రణాళిక ప్రకారం తొలి ఐదు సంవత్సరాల్లో 50 వేలకు పైగా, సెడాన్లు, లగ్జరీ కార్లు, ఇతర ఎలక్ర్టిక్ వాహానాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న సుమారు రూ. 2100 కోట్ల భారీ పెట్టుబడితో 25 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు కేటీఆర్.