Traffic Diversion : హైదరాబాద్‌వాసులకు అలర్ట్‌.. రేపు ఈ ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

Traffic

Traffic

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో రేపు మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడాలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అయితే ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తుండడంతో తెలంగాణ బీజేపీ శ్రేణులు ఈ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీగా జనసమీకరణ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో.. హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ పోలీసులు వెల్లడించారు. బీజేపీ నిర్వహించనున్న ఈ భారీ బహిరంగ సభకు అమిత్‌ షా హజరవుతున్న నేపథ్యంలో.. శంషాబాద్‌, కల్వకుర్తి, బొంగులూరు, పహాడి షరీఫ్‌ నుండి తుక్కుగూడాకు భారీ వాహనాలు వచ్చే అవకాశం ఉన్న క్రమంలో రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆ ఏరియాలో ట్రాఫిక్‌ అంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

అంతేకాకుండా.. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు శ్రీశైలం వైపుకు వాహనాలు అనుమతించబడవని తెలిపారు. దీనితో పాటు.. ఎల్బీ నగర్‌, హయత్‌ నగర్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వారు మందమల్లమ్మ, బాలపూర్‌, వీడియోకాన్‌ జంక్షన్‌ మార్గాలలో వెళ్లాలలని సూచించారు. అలాగే.. దిల్‌సుఖ్‌నగర్‌, మలక్‌పేట, చంద్రాయన గుట్ట నుంచి ఎయిర్‌పోర్ట్‌ వెళ్లే ట్రాఫిక్‌ను అరాంఘర్‌, శంషాబాద్‌ మార్గాల్లో మల్లించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ నెం.14 ద్వారా ఎలాంటి భారీ వాహనాలను నగరంలోకి అనుమతించరని కూడా తెలిపారు.