Telangana: సింగరేణి బొగ్గు గని ప్రమాదంలో ముగ్గురు మృతి

పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్‌లోని సింగరేణి అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టులో బొగ్గు గని పైకప్పు కూలిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. బొగ్గు గని శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురి మృతదేహాలను రెస్క్యూ టీం ఈరోజు వెలికితీసింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో డిప్యూటీ మేనేజర్‌ తేజావత్‌ చైతన్య మృతదేహాన్ని సహాయక సిబ్బంది బయటకు రాగా… బుధవారం ఉదయం ఏరియా సేఫ్టీ ఆఫీసర్‌ ఎస్‌ జయరాజు, కాంట్రాక్ట్‌ కార్మికుడు తోట శ్రీకాంత్‌ మృతదేహాలను వెలికితీశారు. వారి మృతదేహాలను సింగరేణి ఆస్పత్రికి తరలించారు.

సోమవారం ఉదయం 11 గంటల సమయంలో 86వ లెవల్‌ వద్ద హఠాత్తుగా పైకప్పు కూలిపోయింది. దీంతో ఇద్దరు ఉద్యోగులు, ఏడుగురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టిన సింగరేణి రెస్క్యూ బృందం రాత్రి వరకు ముగ్గురిని ప్రాణాలతో కాపాడారు. నలుగురు మాత్రం శిథిలాల కింద చిక్కుకుపోయారు. మంగళవారం మధ్యాహ్నం కార్మికుడు వీరవేన రవీందర్‌ను రెస్క్యూ టీమ్ సభ్యులు క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.