తెలంగాణలో కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో రేపటి నుంచి అంటే జూలై 11 నుంచి జూలై 13 వరకు మూడ్రోజుల పాటు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
Read Also: Amaranath Yatra: ఇద్దరు ఏపీ యాత్రికులు గల్లంతు.. ఏపీ సర్కార్ ప్రకటన
మరోవైపు తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ వార్నింగ్ ప్రకటించింది. ఉత్తర తెలంగాణలో పరిస్థితి తీవ్రంగా ఉందని వివరించింది. మొత్తం 13 జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. భూపాలపల్లి జిల్లాలోని ముత్తారం, మహదేవ్పూర్ ప్రాంతాల్లో గడచిన 24 గంటల వ్యవధిలో అత్యధికంగా 31.3 సెం.మీ. మేర వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అటు భారీ వర్షాలకు భద్రాచలంలో గోదావరి నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు గోదావరి నీటిమట్టం 34.8 అడుగులకు చేరింది.