Revanth Reddy Warning: అభిమానులకు రేవంత్‌రెడ్డి వార్నింగ్‌.. అలా చేస్తే మీరు ఉండరు..!

Revanth Reddy

Revanth Reddy

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ఎప్పుడూ సోషల్‌ మీడియా పోస్టులు చిచ్చుపెడుతూనే ఉన్నాయి.. తమకు నచ్చని నేతలను సోషల్‌ మీడియా వేదికగా రేవంత్‌రెడ్డి వర్గం టార్గెట్‌ చేస్తుందని.. వారిని కించపర్చే విధంగా పోస్టులు పెడుతున్నారని.. తిట్టిపోస్తున్నారే విమర్శలు ఉన్నాయి.. వీటిపై కొందరు సీనియర్లు, పార్టీ నేతలు పలు సందర్భాల్లో బహిరంగానే మాట్లాడారు.. అయితే, ఇవాళ తన అభిమానులకు వార్నింగ్‌ ఇచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి.. పార్టీలో ఉండే నాయకులపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టొద్దని సూచించిన ఆయన.. నా అభిమానులు ఎవరు అలా చేసినా పార్టీలో ఉండరు అని హెచ్చరించారు. పార్టీలో నాయకులను ఎవరు అవమనిచినా… కాంగ్రెస్ కుటుంబాన్ని అవమాన పరిచినట్టే అన్నారు రేవంత్‌రెడ్డి.

Read Also: Hyderabad: ఫేక్ బాబాపై కేసు.. పరారీలో రామ్‌దాస్

ఇక, సీఎం ఎవరు అనే విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు రేవంత్‌ రెడ్డి.. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎవరిని సీఎం చేస్తే… వాళ్లను నేనే భుజాల మీద తీసుకెళ్లి కూర్చోబెడతా అన్నారు.. సోనియా గాంధీ ఎవరి పేరు చెబితే వాళ్లే సీఎం అవుతారని స్పష్టం చేశారు. మనపై మనం కాదు.. మనం రాజకీయ శత్రువులపై బలాన్నీ చూపించాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ రాముడు అయితే నేను హన్మంతుడిని… మీరంతా వానర సైన్యం అని నమ్ముతాను.. అందుకే ఏఐసీసీ డిజిటల్ సభ్యత్వం టార్గెట్ పూర్తి చేశామని తెలిపారు.. 90 రోజుల్లో 45 లక్షల సభ్యత్వం చేసిన ఘనత మనది అని.. హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలతో ఇబ్బంది పడ్డ నన్ను… సభ్యత్వంతో కార్యకర్తలు నిలబెట్టారని తెలిపారు. పార్టీ కోసం ఏడాదిలో ఎన్నో కార్యక్రమాలు చేశాం.. కానీ, హుజురాబాద్ మాత్రం కొంత ఇబ్బంది పెట్టింది.. ఇలాంటి సమయంలో కార్యకర్తలు నాకు కొండంత అండగా నిలబడ్డారని వ్యాఖ్యానించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.