గ్రామీణాభివృద్ధి, సుస్థిర పరిపాలనలో విశిష్ట ప్రతిభ కనబరిచిన తెలంగాణ పంచాయతీలకు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు’ రాష్ట్రంలోని రెండు గ్రామ పంచాయతీలను వరించాయి. వికారాబాద్ జిల్లా కోటేపల్లి మండలానికి చెందిన మోతుకుపల్లి గ్రామ పంచాయతీ “గుడ్ గవర్నెన్స్” విభాగంలో జాతీయ అవార్డును దక్కించుకోగా, సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండల పరిధిలోని ఫసల్వాడి గ్రామ పంచాయతీ “విమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ” విభాగంలో అత్యుత్తమ పురస్కారాన్ని సాధించింది. గ్రామ స్థాయిలో అత్యంత పారదర్శకమైన పరిపాలన అందించడం, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయడం , మహిళా సాధికారత, భద్రత, సంక్షేమ కార్యక్రమాల అమలులో చూపిన అసాధారణ కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు లభించాయి.
Airtel Rs 48 Plan : ఎయిర్టెల్ నుంచి అదిరిపోయే ప్లాన్.. ఈ ఆఫర్ తెలిస్తే యూజర్లు అస్సలు వదలరు!
జాతీయ స్థాయిలో తెలంగాణ పంచాయతీలకు ఈ గౌరవం దక్కడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధి, పారదర్శక పాలన , మహిళా సాధికారత దిశగా తమ ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్టమైన చర్యలకు ఈ అవార్డులే నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ఈ అద్భుత విజయాన్ని సాధించిన మోతుకుపల్లి, ఫసల్వాడి గ్రామ పంచాయతీల ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థాయి సిబ్బంది , గ్రామస్థులకు ఆమె హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇలాంటి విజయాలు రాష్ట్రంలోని ఇతర పంచాయతీలకు గొప్ప ప్రేరణగా నిలుస్తాయని, భవిష్యత్తులో మరిన్ని గ్రామాలు అభివృద్ధి బాటలో నడిచి జాతీయ స్థాయిలో తెలంగాణ కీర్తిని చాటాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.
