తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో చాలా మంది విద్యార్థులకు తక్కువ మార్కులు రావడం చర్చనీయాంశంగా మారింది. కొన్నింటిలో 90కి పైగా మార్కులు రాగా మరికొన్నింట్లో తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో కొన్ని సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఫెయిల్ అయ్యారు. ఉదాహరణకు హైదరాబాద్ నగరానికి చెందిన ఓ విద్యార్థికి ఇంగ్లీష్లో 92 మార్కులు, సంస్కృతంలో 93 మార్కులు, ఫిజిక్స్లో 55 మార్కులు, కెమిస్ట్రీలో 50 మార్కులు రాగా మ్యాథ్స్ Aలో 27, మ్యాథ్స్ Bలో 16 మార్కులే వచ్చాయి. దీంతో సదరు విద్యార్థి ఫెయిల్ అయ్యాడు.
Read Also: పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. కేసీఆర్ ప్రకటన
కాగా కొంతమంది విద్యార్థులు తాము పరీక్షలు బాగా రాశామని, అయినా తక్కువ మార్కులు వచ్చాయని ఆరోపిస్తున్నారు. దీంతో చాలా మంది విద్యార్థులు రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే కొందరు విద్యార్థులు తాము ఫెయిల్ అయ్యామనే బాధతో సూసైడ్లకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఓ విద్యార్థి కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ట్విట్టర్లో పోస్ట్ చేసి మంత్రులు కేటీఆర్, సబితలను ట్యాగ్ చేయగా… ఈ ట్వీట్ తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఇంటర్ పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయన్న మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. నల్గొండ గాంధీనగర్కు చెందిన జాహ్నవి(16)కి తక్కువ మార్కులు రావడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆమె శుక్రవారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. మరోవైపు నిజామాబాద్కు చెందిన మరో విద్యార్థి మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
