GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్

  • గ్రామ పాలనా అధికారులకు గుడ్ న్యూస్
  • 60:40 నిష్పత్తితో పదోన్నతులు
  • సర్వీస్ రూల్స్‌లో కీలక సవరణలు
  • ఉద్యోగుల్లో ఉత్సాహం పెంచిన నిర్ణయం
Telangana Logo

Telangana Logo

Telangana Govt Clears Promotions for GPOs with 60:40 Senior Assistant Ratio : తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పాలనా అధికారుల (G.P.Os) సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయిలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు , గ్రామ పాలనా అధికారుల పదోన్నతులకు సంబంధించి తెలంగాణ మినిస్టీరియల్ సర్వీస్ రూల్స్, 1998కు సవరణలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో జూనియర్ అసిస్టెంట్లు/టైపిస్టులు , గ్రామ పాలనా అధికారుల మధ్య 60:40 నిష్పత్తిని ఖరారు చేశారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం జిల్లా స్థాయిలో అందుబాటులో ఉన్న పదోన్నతులలో 60 శాతం కోటాను రెవెన్యూ విభాగంలోని జూనియర్ అసిస్టెంట్లకు, మిగిలిన 40 శాతం కోటాను గ్రామ పాలనా అధికారులకు కేటాయించనున్నారు.

 

ఈ చారిత్రాత్మక మార్పులు 2026 ఫిబ్రవరి 12వ తేదీ నుంచి అమలులోకి వచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA) పంపిన ప్రతిపాదనలను నిశితంగా పరిశీలించిన తర్వాత, రొటేషన్ పద్ధతిలో ఈ పదోన్నతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సవరణల వల్ల గ్రామ పంచాయతీ స్థాయిలో పనిచేస్తున్న అధికారులకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందేందుకు లైన్ క్లియర్ అయింది. ప్రభుత్వ నిర్ణయంతో అటు రెవెన్యూ సిబ్బంది, ఇటు గ్రామ పాలనా అధికారుల మధ్య పదోన్నతుల విషయంలో ఉన్న సందిగ్ధత తొలగిపోయి, ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.