తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం, అహింసా మూర్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి జయంతి వేడుకలను ఇకపై ప్రతి ఏటా రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అధికారిక జీవో విడుదల చేసింది.
ఏప్రిల్ 26న అధికారిక వేడుకలు..
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి సంవత్సరం ‘వైశాఖ శుక్ల పక్ష దశమి’ రోజున వాసవి మాత జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఈ పర్వదినం ఏప్రిల్ 26వ తేదీన వస్తుండటంతో, ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది.
జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు..
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను కోరింది. ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి యువజన సర్వీసులు, పర్యాటక సాంస్కృతిక శాఖను నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమాల కోసం అయ్యే ఖర్చును సంబంధిత శాఖ బడ్జెట్ నుంచే కేటాయించనున్నారు.
ఆర్యవైశ్యుల హర్షం.
వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం పట్ల ఆర్యవైశ్య సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సమాజ సేవలో, వ్యాపార రంగంలో ముందుండే ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని ఈ నిర్ణయం పెంపొందిస్తుందని వారు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణ రావు పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వ నిర్ణయంతో ఈ నెల 26న తెలంగాణవ్యాప్తంగా ఉన్న వాసవి దేవాలయాలు, ఆర్యవైశ్య సత్రాలలో వేడుకలు ప్రభుత్వ లాంఛనాలతో అత్యంత వైభవంగా జరగనున్నాయి.
