Rythu Bandhu Funds: రైతుబంధు పథకం కింద నగదు బదిలీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు సంబంధించిన నిధులు జమ చేసినప్పటికీ, యాసంగి సీజన్కు సంబంధించి రెండో విడత నిధులు నవంబర్లోనే రైతులకు అందించాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ రావడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున డిపాజిట్లపై నిషేధం విధించాలని సూచించింది. కాంగ్రెస్ అభ్యర్థనను తోసిపుచ్చిన ఎన్నికల సంఘం నవంబర్ 24న యాసంగి సీజన్లో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినా ఇంకా డబ్బులు జమ కాలేదు. శని, ఆది, సోమవారాల్లో వరుసగా సెలవులు రావడంతో మంగళవారం 28న జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాసంగి సీజన్లో రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతుబంధు ఆర్థిక సహాయం పంపిణీ చేసేందుకు అనుమతించారు.
Read also: CM KCR: నాలుగు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు.. పాల్గొననున్న కేసీఆర్
ఈ నెల 28లోగా పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. దీని ప్రకారం శుక్రవారం రాత్రి భూపరిపాలన ప్రధాన కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యాలయాలు ఈ-కుబేర్ పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని 70 లక్షల మంది అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశాయి. అనంతరం ఫైలును ఆర్థిక శాఖకు పంపించారు. దీని ప్రకారం ఆర్థిక శాఖ రూ.7700 కోట్ల మొత్తాన్ని ట్రెజరీల నుంచి బ్యాంకులకు బదిలీ చేయాలి. ఆ తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. శని, ఆది, సోమవారాలు సెలవులు కావడంతో ట్రెజరీలతో పాటు బ్యాంకులు కూడా పని చేయడం లేదు. మంగళవారం మళ్లీ పని దినం కావడంతో… ఆ రోజు ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అర్హులైన రైతుల ఖాతాల్లోకి నగదు జమ ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి కొన్ని గంటల్లోనే ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. రైతుబంధు సాయం పంపిణీకి సంబంధించి రాష్ట్ర ఖజానా, వ్యవసాయ అధికారులకు శనివారం నాడు సమాచారం అందినట్లు తెలిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 30న ఓటింగ్ జరగనుందని, ఈ నెల 28న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయితే బీఆర్ఎస్ పార్టీకి పెద్ద బూస్ట్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
RBI: వ్యక్తిగత రుణాలపై ఆర్ బిఐ కొత్త రూల్స్.. ఇక అప్పు పుట్టుడు కష్టమే..
