తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె , వారి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికులకు కీలక విన్నపం చేశారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, ప్రాణాలు తీసుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావని ఆయన స్పష్టం చేశారు.
చిత్తశుద్ధితో సమస్యల పరిష్కారం..
కార్మికుల సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందని సీఎం భరోసా ఇచ్చారు. “మీ కుటుంబాలను అన్యాయం చేయకండి. రేపు డిప్యూటీ సీఎం కార్మిక సంఘాలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు,” అని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం చర్చలకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని, సానుకూల వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుందామని ఆయన పిలుపునిచ్చారు.
కార్మికుల సంక్షేమమే ధ్యేయం..
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల క్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు. కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారి వెన్నంటే ఉంటుందని హామీ ఇచ్చారు.
క్షమించరాని ప్రాణత్యాగాలు..
కార్మికులు ప్రాణాలు తీసుకోవాలనుకోవడం అత్యంత బాధాకరమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. క్యాబినెట్లో ఈ విషయంపై తీవ్రంగా చర్చించామని, కార్మికులు తమ కుటుంబాల గురించి ఆలోచించాలని కోరారు. కార్మిక సంఘాలు చర్చలకు ముందుకు వచ్చి సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీని కాపాడుకోవడంతో పాటు, కార్మికుల ప్రయోజనాలను రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా క్యాబినెట్ స్పష్టం చేసింది.
