Revanth Reddy: దత్తత కాదు ధైర్యం ఉంటే కొడంగల్ లో పోటీ చెయ్ తేల్చుకుందామని కేసీఆర్ కు నేను సవాల్ విసిరా! కానీ.. అభివృద్ధి చేయలేదు కాబట్టే నేను విసిరిన సవాల్ ను కేసీఆర్ స్వీకరించలేదని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ సమాజమంతా కూర్చుని ఆలోచన చేయాలన్నారు. మీ ఆశీర్వాదమే అండగా.. మీరిచ్చిన బలంతో ఈ కొడంగల్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ప్రాంతం పేరు నిలబెట్టా అన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇంత గొప్ప అవకాశం కొడంగల్ కు వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి నాది కాదు… మీదే.. కొడంగల్ లో ప్రతీ బిడ్డ కాంగ్రెస్ కు అధ్యక్షుడే అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మీ అందరిపై ఉందన్నారు. కృష్ణా రైల్వే లైన్, జూనియర్, పీజీ కాలేజీలు, కృష్ణా జలాలు వస్తాయని ఆనాడు కేసీఆర్ గుర్నాధ్ రెడ్డిని నమ్మించారని తెలిపారు. ఐదెళ్లలో కొడంగల్ కు కేసీఆర్ , కేటీఆర్ ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేరలేదు… అభివృద్ధి జరగలేదన్నారు. హామీలు ఇచ్చి మోసం చేసిన బీఆరెస్ సన్నాసులు ఇవాళ ఏ ముఖంతో ఓట్లు అడుగుతారు? అని ప్రశ్నించారు. అన్నీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కేనా… కొడంగల్ కు ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు.
దత్తత కాదు ధైర్యం ఉంటే కొడంగల్ లో పోటీ చెయ్ తేల్చుకుందామని కేసీఆర్ కు నేను సవాల్ విసిరా.. అభివృద్ధి చేయలేదు కాబట్టే నేను విసిరిన సవాల్ ను కేసీఆర్ స్వీకరించలేదన్నారు. ఈ ఎన్నికలు కొడంగల్ ప్రాంత ప్రజలకు.. కేసీఆర్ కు మధ్య జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఎన్నికలు ఆశామాషీ ఎన్నికలు కాదు.. ఇక్కడి ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే ఎన్నికలన్నారు. దేశ ముఖ చిత్రంలో కొడంగల్ కు ఒక గుర్తింపు తెచ్చే ఎన్నికలు అని తెలిపారు. గ్రూపులు, గుంపులు కాదు.. కొడంగల్ అంతా కలిసి రావాలి… కాంగ్రెస్ ను గెలిపించేందుకు ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు. చీలిపోతే కూలిపోతాం.. కూలిపోతే మీ జీవితాలు ఆగమైతాయ్ అన్నారు. ఈ ఎన్నికల్లో కర్ణాటక కంటే గొప్ప తీర్పు కొడంగల్ ప్రజలు ఇవ్వాలన్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్ కంటే ఎక్కువ మెజారిటీతో కొడంగల్ లో కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. గెలిచిన రెండేళ్లలో నారాయణపేట కొడంగల్ ఎత్తి పోతల పూర్తి చేసి నీళ్లు తీసుకొస్తా.. అని హామీ ఇచ్చారు. ఏడాదిలో మహబూబ్ నగర్ చించొలి జాతీయ రహదారి పూర్తి చేయిస్తానని తెలిపారు. ఇక్కడి ఆడబిడ్డలకు ప్రత్యేక డిగ్రీ కాలేజీలు తీసుకోస్తాం అని స్పష్టం చేశారు. అండగా నిలబడే మీ ఆత్మగౌరవం నిలబెట్టే బాధ్యత నాది అన్నారు.
Etela Rajender: కాళ్ళ కింద భూమి కదులుతుంది.. కేసీఆర్ గ్రహించటం లేదు
