మూడు రోజులు తెలంగాణలో తమాషా కార్యక్రమం జరగబోతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవళి అన్నారు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే మహిళలు బతుకుతున్నారు అనే విధంగా టీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్లో మంత్రి పదవులు అనుభవించిన సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్ ను పొగడడం ఆశ్చర్యం వేసిందని ఆమె అన్నారు. ఎంపీ మాలోతు కవిత ఎక్కడి నుంచి వచ్చిందో మర్చిపోయిందా.. కాంగ్రెస్ బిక్ష వల్లే కవిత రాజకీయాల్లో ఉందని ఆమె విమర్శించారు. కేసీఆర్ వచ్చిన తర్వాతే ఆడ పిల్లలకు పెళ్ళిళ్ళు అయినట్లు.. టీఆర్ఎస్ వచ్చిన తర్వాతే పిల్లలు పుడుతున్నట్లు టీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇంట్లోంచి పెన్షన్లు ఇస్తున్నారా.. ఎందుకు రాఖీ కట్టాలని ఆమె ప్రశ్నించారు.
టీఆర్ఎస్ మద్యం పాలసీ వల్ల.. ఎంతో మంది ఆడబిడ్డల తాళి బోట్లు తెగాయని ఆమె మండిపడ్డారు. ఖమ్మంలో 6 సంవత్సరాల బాలికపై నాన్ బెయిల్ కేసు పెట్టిన విషయం టీఆర్ఎస్ నేతలు మర్చిపోయారా అని, గిరిజన మహిళా రైతులను చెట్లకు కట్టేసి కొట్టిన చరిత్ర టీఆర్ఎస్ది అని ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బంధు కాదు.. మహిళా రాబందు ప్రభుత్వం టీఆర్ఎస్ అంటూ ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు. నామినేటెడ్ పోస్ట్ లలో ఎంతమంది మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని, టీఆర్ఎస్ సంబరాలను బైకాట్ చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
