Accident : మెదక్ జిల్లా రామాయంపేట జాతీయ రహదారి (NH-44) Y జంక్షన్ వద్ద సోమవారం తీవ్ర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామాయంపేట తెలంగాణ మోడల్ స్కూల్ నుండి విద్యార్థులతో నస్కల్ వైపు వెళ్తున్న స్కూల్ ఆటోను వెనుక నుంచి వచ్చిన ఒక లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పదిమంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన పిల్లలను చికిత్స నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఆరో తరగతి చదువుతున్న నగరం తండా గ్రామానికి చెందిన లావణ్య అనే విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్షతగాత్రులకు రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణమైన లారీని, డ్రైవర్ను అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.

