Hyderabad: డిస్కౌంట్ ధరకు రాజీవ్ స్వగృహ ఇళ్ల అమ్మకం

హైదరాబాద్ నగరంలో రాజీవ్ స్వగృహ పథకంలో భాగంగా నిర్మించిన ఇళ్లపై హెచ్ఎండీఏ కీలక ప్రకటన చేసింది. రాజీవ్ స్వగృహ ఇళ్ల వేలానికి సంబంధించి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. బండ్లగూడ, నాగోల్‌లోని సహ భావన టౌన్‌షిప్ 15 టవర్‌లో మొత్తం 2246 ఇళ్లు అమ్మకానికి ఉన్నాయని తెలిపింది. వీటిలో చదరపు గజం కనీస ధర రూ. 2200 నుంచి రూ. 2700గా నిర్ణయించారు. అలాగే ఖమ్మం జిల్లా పోలేపల్లిలోని జలజ టౌన్ షిప్ 8 టవర్‌లో ఏకంగా 576 ఇళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ చదరపు గజం రూ.1500 నుంచి 2000 వరకు నిర్ణయించారు.

ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మార్చి 22 నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు హెచ్‌ఎండీఏ వెల్లడించింది. అయితే రిజిస్ట్రేషన్ ఫీజు కాకుండా వారు రూ.11,800 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. వచ్చే నెల 24వ తేదీ ఇళ్ల వేలం ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నామని హెచ్ఎండీఏ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.