వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది హైదరాబాద్లోని ప్రిజం పబ్. అయితే ఇప్పటికే పలు ఘటనల్లో ప్రిజం పబ్కు సంబంధం ఉంది. తాజాగా మరోసారి కస్టమర్పై దాడి చేసి ప్రిజం పబ్ వార్తల్లో నిలిచింది. పబ్కు వచ్చిన నంద కిషోర్ అనే వ్యక్తిపై ప్రిజం పబ్ బౌన్సర్లుతో కలిసి యాజమాన్యం పిడిగుద్దులు కురిపించారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
ఈ నేపథ్యంలో నందకిషోర్ ఎన్టీవోతో మాట్లాడుతూ.. ‘మొదటిసారి ప్రిజం పబ్ కి వెళ్ళాను. అక్కడ నాన్ స్మోకింగ్ జోన్ అని తెలియదు. స్మోక్ చేస్తుంటే… వెనక నుంచి వచ్చి ఒక బౌన్సర్ దాడి చేశాడు. వెంటనే… మరికొంత మంది బౌన్సర్లు వచ్చి కొడుతూనే ఉన్నారు. పబ్ యాజమాన్యం కూడా వచ్చి దాడి చేశారు. మా ఫ్రెండ్స్ బౌన్సర్ల కాళ్ళు పట్టుకున్నారు… అయినా కూడా కొడుతూనే ఉన్నారు. కొట్టడమే… పనిగా పెట్టుకున్నారు… కొట్టడం బౌన్సర్ల కి ఫ్యాషన్ అయ్యింది.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉంటే.. గతంలో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పై దాడి ఘటన, గత నెల హొలీ రోజు ప్రిజంలో పార్టీ చేసుకుని వస్తూ.. మహేశ్వరి అనే మహిళ, జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి మృతి చెందింది. అంతేకాకుండా కోవిడ్ టైమ్ లో నిబంధనలు అతిక్రమించి… 5 వేల మందితో.. మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించి ప్రిజం పబ్ వార్తల్లో నిలిచింది.
