Pawan Kalyan Fan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ (17) ఇకలేరు. గత కొంతకాలంగా అరుదైన జన్యుసంబంధిత (మస్కులర్ డిస్ట్రోఫీ) వ్యాధితో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నిరంజన్ ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను అత్యవసర చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. నిరంజన్ మృతితో హనుమకొండలోని హనుమాన్ నగర్లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
మూడేళ్ల వయసు నుంచే పోరాటం..
నిరంజన్ మూడేళ్ల ప్రాయం నుంచే ఈ అరుదైన వ్యాధి బారిన పడ్డారు. ఈ వ్యాధి ప్రభావం వల్ల 17 ఏళ్ల వయసు వచ్చినా కూడా ఆయన కేవలం నాలుగేళ్ల చిన్నారి రూపంలోనే ఉండిపోయారు. శారీరకంగా ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ అంటే నిరంజన్కు ప్రాణం. ఆయన సినిమాలకు డ్యాన్స్ చేస్తూ, పవన్ కళ్యాణ్ స్టైల్స్ అనుకరిస్తూ స్థానికంగా ‘ఛోటా గబ్బర్ సింగ్’గా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇటీవలే తీరిన కల.. ఇంటికొచ్చి పరామర్శించిన పవన్
తన ప్రాణ సమానుడైన హీరో పవన్ కళ్యాణ్ను కలవాలన్నదే నిరంజన్ చివరి కోరిక. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా జనసేనాని దృష్టికి వెళ్లడంతో, పవన్ కళ్యాణ్ గత జూన్ 17న హనుమకొండలోని నిరంజన్ నివాసానికి స్వయంగా వచ్చి.. మంచానికే పరిమితమైన నిరంజన్ పక్కన కూర్చుని, ఆత్మీయంగా ముద్దాడి, ధైర్యం చెప్పారు. నిరంజన్ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించడంతో పాటు, వారి జీవనోపాధి కోసం ఒక క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని, భద్రకాళి అమ్మవారి వెండి విగ్రహాన్ని బహూకరిస్తానని పవన్ హామీ ఇచ్చారు.
జనసేన శ్రేణుల సంతాపం
తమ అభిమాన హీరోను కలిసి, ఆ ఆనందంలో మునిగితేలిన కొన్ని రోజులకే నిరంజన్ అనంత లోకాలకు వెళ్లిపోవడం అటు కుటుంబ సభ్యులను, ఇటు పవన్ అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. నిరంజన్ మరణ వార్త తెలిసిన వెంటనే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, నిరంజన్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

