NTV Telugu Site icon

Mahender Reddy: టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు.. టికెట్‌ నాకే..!

టీఆర్ఎస్‌ సీనియర్‌ నేత, మంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వచ్చే ఎన్నికల్లో తాను తాండూరు నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు.. పార్టీ నాకే టిక్కెట్ ఇస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. అంతేకాదు.. తాండూరు మున్సిపల్‌ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ఐదేళ్లు పదవిలో ఉంటారని.. నాలుగేళ్ల తర్వాత అవిశ్వాసం పెట్టినా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.. మెజార్టీ మున్సిపల్‌ కౌన్సిలర్లు నాతోనే ఉన్నారని తెలిపారు పట్నం మహేందర్‌ రెడ్డి.

Read Also: Russia Ukraine War: భారత్‌పై తీవ్ర ప్రభావం.. వీటి ధరలు పెరుగుతాయి..!

మరోవైపు ప్రస్తుత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వెంట ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు నాతో టచ్‌లో ఉన్నారని పేర్కొన్నారు మహేందర్‌రెడ్డి… నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నా వెంట రావడానికి వారు సిద్ధంగా ఉన్నారంటూ ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుంచి బరిలోకి దిగిన పట్నం మహేందర్‌రెడ్డి.. ఓటమిపాలయ్యారు.. ఆయనపై కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన పైలట్‌ రోహిత్‌రెడ్డి విజయం సాధించారు.. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే కాగా.. మళ్లీ నేను తాండూరు నుంచే పోటీ చేస్తా.. టికెట్‌ కూడా నాకే వస్తుంది అంటూ వ్యాఖ్యానించి.. కాకరేపారు మహేందర్‌రెడ్డి. ఇప్పటికే మహేందర్‌రెడ్డి-రోహిత్‌రెడ్డి వర్గాల మధ్య వర్గపోరు కూడా కొన్నిసార్లు బహిర్గతం అయిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు మహేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎటువైపు దారితీస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది.