గ్రీన్ఇండియా చాలెంజ్ లో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.పద్మజారెడ్డి పాల్గొన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమం.చెట్లు నాటడం అంటే దైవకార్యం తో సమానం అని ఆమె అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా బేగంపేటలోని తన నివాసంలో డా.పద్మజారెడ్డి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా డా.పద్మజారెడ్డి మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిందని, ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారని ఈ రోజు నేను పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.
చెట్లు నాటడం అంటే దైవ కార్యక్రమంతో సమానమని అన్నారు. చెట్లు అంటే చాలా ఇష్టమని, తమ ఇంటి వద్ద, వ్యవసాయ క్షేత్రంలో ఎన్నో చెట్లు నాటామని గుర్తు చేశారు. మొక్కలు పెరిగి పెద్దయి తల్లిలా చూసుకుంటాయని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరు వీలైనన్ని మొక్కలు నాటాలని కోరారు. ప్రభుత్వం ఇల్లు కట్టుకునేముందు ప్రతి ఒక్కరు తమ ఇంటివద్ద చెట్లు నాటాలని ఒక రూల్ తెస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తన స్నేహితులు ప్రతిభ, వనజ, ఉమరాణి లకు గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.
