Site icon NTV Telugu

Off The Record : పార్టీ కన్నా ఎవరూ ఎక్కువ కాదన్న సందేశం ?

Rajasingh

Rajasingh

 

బీజేపీ అధిష్టానం రాజాసింగ్‌ రాజీనామాను ఆమోదించడం వెనక బలమైన కారణాలున్నాయా? అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం ద్వారా ఏం చెప్పాలనుకుంది ఢిల్లీ నాయకత్వం? ఆ విషయమై పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఫైర్ బ్రాండ్ లీడర్‌, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి చేసిన రాజీనామాను ఆమోదించింది పార్టీ హైకమాండ్‌. రిజైన్‌ లెటర్‌లో రాజా ప్రస్తావించిన అంశాలను కూడా తప్పు పట్టింది కేంద్ర పార్టీ. అంతకు ముందు ఒకసారి పార్టీ నుంచి సస్పెండ్‌ అయ్యారు ఎమ్మెల్యే. ఆ తర్వాత కొన్నాళ్ళకు సస్పెన్షన్ ఎత్తేసి… 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్‌ ఇచ్చింది కాషాయ పార్టీ. ఈ విడత గెలిచాక… గత కొంత కాలంగా పార్టీ మీద, నేతల మీద గట్టి విమర్శలే చేస్తూ వచ్చారు రాజాసింగ్‌. చివరకు మొన్న జూన్‌ 30న బీజేపీకి రాజీనామా చేశారాయన. ఆ లెటర్‌ రాష్ట్రం నుంచి కేంద్ర పార్టీకి వెళ్ళిన 15 రోజులలోపే ఆమోదించింది… తక్షణమే అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించేసింది కేంద్ర నాయకత్వం. రాజాసింగ్‌కు తెలంగాణలోనే కాదు.. దేశ వ్యాప్తంగా హిందుత్వకు సంబంధించి వివిధ వర్గాల్లో అభిమానులున్నారు. అయన ఏదైనా మాట్లాడితే… దాని సమయం, సందర్భాన్నిబట్టి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది కూడా. అలాంటి నాయకుడు, ఎమ్మల్యే హోదాలో ఉండి… పార్టీకి రాజీనామా చేస్తే… కేంద్ర పార్టీ పెద్దలు కనీసం పిలిచి మాట్లాడలేదు. ఎందుకు, ఏమిటని అడిగి ఆయన అభిప్రాయాలను తెలుసుకోలేదు.

పైగా రాజీనామా లేఖలో రాజాసింగ్‌ ప్రస్తావించిన అంశాలనే తప్పు పట్టింది బీజేపీ హై కమాండ్‌. దీంతో ఎందుకిలా జరిగింది? గోషామహల్ ఎమ్మెల్యేని పార్టీ పెద్దలు ఎందుకు లైట్‌ తీసుకున్నారంటూ చర్చలు మొదలయ్యాయి కాషాయ వర్గాల్లో. ప్రధాని మోడీ నుంచి మొదలు పెడితే ఢిల్లీలోని పార్టీ ముఖ్య నేతలంతా… రాజాసింగ్‌ని వ్యక్తిగతంగా గుర్తు పడతారు. వాళ్ళకు ఆయన గురించి తెలుసు కూడా. అయినా సరే…. రాజీనామా ఆమోదం విషయంలో ఇవేమీ పనికి రాలేదు, పార్టీ వెనకడుగు వేయలేదు. దీనిచుట్టూనే ఇప్పుడు సరికొత్త విశ్లేషణలు మొదలయ్యాయి. మొహమాటాలకు పోయి… ఇప్పుడు రాజాసింగ్‌ని వదిలేస్తే… రేపు ఇలాంటి వాళ్ళు మరికొందరు తయారవుతారని బీజేపీ పెద్దలు భావిస్తున్నారా? గోషామహల్ ఎమ్మెల్యే రాజీనామాను ఆమోదించడం ద్వారా…. క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని చెప్పారా? వ్యక్తులకంటే పార్టీనే గొప్పదన్న సందేశం పంపారా అంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి కాషాయ దళంలో.

ఎట్టి పరిస్థితుల్లో….పార్టీ కన్నా ఎవరూ ఎక్కువ కాదని, గీత దాటితే ఎంతటి వారైనా సరే… మినహాయింపులు ఉండవని, వేటు తప్పదన్న స్పష్టత ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.తెలంగాణలో చాలా మంది నేతలు పార్టీ లైన్ తప్పి సొంత అజెండాతో ముందుకు పోతున్నారన్న భావన బీజేపీ పెద్దల్లో బలంగా ఉందట. అందుకే రాజాసింగ్‌ ఎపిసోడ్‌ ద్వారా అందరికీ సందేశం పంపినట్టు చెప్పుకుంటున్నారు. పార్టీకి తాత్కాలికంగా నష్టం జరిగినా ఫర్లేదుగానీ… ఇలాంటి వాటిని ఉపేక్షించకూడదని డిసైడైందట కేంద్ర నాయకత్వం. అందుకే ఎమ్మెల్యే అయినాసరే… చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

 

Exit mobile version