Off The Record : ఖమ్మం పాలిటిక్స్.. కలెక్టర్లు తట్టుకోలేకపోతున్నారా? ముగ్గురి మార్పు వెనుక అసలు కథ!

  • ముగ్గురు మంత్రుల మధ్య ఏకాభిప్రాయం లేదని విపక్షాల విమర్శలు
  • సయోధ్యలేక ఉన్నతాధికారులు ఇబ్బందిపడుతున్నారన్న టాక్‌
  • గడిచిన రెండున్నరేళ్ళలో ఖమ్మంకు నాలుగో కలెక్టర్‌
  • కలెక్టర్ల బదిలీలకు రాజకీయ వత్తిళ్ళే కారణమన్న చర్చలు
Khammam

Khammam

ఆ జిల్లాలో రెండున్నరేళ్ళలో ముగ్గురు కలెక్టర్లు ఎందుకు మారారు? కొత్తగా వచ్చిన ఫోర్త్‌ పర్సన్‌ ఎన్నాళ్ళు ఉంటారు? రాజకీయ వత్తిళ్ళు తట్టుకోలేక వాళ్ళే ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని వెళ్ళిపోతున్నారా? లేక పొలిటికల్‌ పోరుకు బలవుతున్నారా? అక్కడ పని చేయడం కత్తి మీద సామేనన్న మాటలు ఏ జిల్లా విషయంలో వినిపిస్తున్నాయి? అసలు ఎందుకలా జరుగుతోంది? ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర కేబినెట్‌లో ముగ్గురు మంత్రులు ఉన్నారు. పైగా వాళ్ళవేం సాదాసీదా శాఖలు కాదు. ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన శాఖలన్నీ ఈ ముగ్గురి దగ్గరే ఉన్నాయి. భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముగ్గురూ ముగ్గురే. అంత వరకు బాగానే ఉన్నా…దానివల్లే ఇప్పుడు ఆ పవర్‌ వల్లే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతున్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం ఉండదని ప్రతిపక్షాలు తరచూ విమర్శిస్తూనే ఉన్నాయి. ధాన్యం సేకరణ ఇబ్బందులకు సంబంధించి ముగ్గురూ కలిసి ఒక్కసారి కూడా సమావేశం కాలేదని, అధికారులతో మీటింగ్స్‌ పెట్టలేదని బీఆర్‌ఎస్‌ పదేపదే విమర్శిస్తోంది.

ముగ్గురి మధ్య సయోధ్య లేని కారణంగానే.. ఈ పరిస్థితి తలెత్తిందని, చివరికి జిల్లాలో ఉన్నతాధికారులు కూడా ఇబ్బందులు పడుతున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. సోషల్‌ మీడియా ఇదే విషయంలో కోడై కూస్తోంది. కలెక్టర్ల బదిలీలనే ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు విమర్శకులు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ళు కాగా….ఈ టైంలో ఖమ్మం కలెక్టర్లుగా నలుగురు మారడాన్నే ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు. నాలుగో కలెక్టర్‌గా దివాకర్ బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నికలకు ముందు గౌతమ్ ఉన్నారు. ఆ తర్వాత ముజ్ ముల్ ఖాన్ వచ్చారు. కొద్ది రోజులకే ఆయన ట్రాన్స్‌ఫర్ అయి అనుదీప్ దురిశెట్టి వచ్చారు. పట్టుమని పది నెలలు కూడా పనిచేయకుండానే ఆయన్ని బదిలీ చేసి ములుగు కలెక్టర్‌గా ఉన్న దివాకర్‌కు ఖమ్మంలో పోస్టింగ్ ఇచ్చారు. ఇలా రెండున్నరేళ్ళ కాలంలో ముగ్గురు కలెక్టర్లు బదిలీ అయిపోయి నాలుగో ఆఫీసర్‌ వచ్చారంటేనే ఇక్కడున్న రాజకీయ వత్తిళ్ళను అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు.

ముగ్గురు మంత్రులు ఉండటంతో… ఒకే రోజు ఇద్దరు మినిస్టర్స్‌ గనుక జిల్లా పర్యటనకు వస్తే…. ఇక అధికారులకు చుక్కలేనని అంటున్నారు. అధికారిక కార్యక్రమాల్లో కలెక్టర్‌ తమ వెంట ఉంటాలంటే తమ వెంటే ఉంటాలంటూ వత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అధికారులు ఎవ్వర్నీ శాటిస్‌ఫై చేయలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఉన్నతాధికారుల మీద వత్తిడి పెరిగి అది కింది స్థాయికి కూడా వెళ్తోందట. ఇదే సమయంలో మరో రకమైన చర్చ కూడా నడుస్తోంది జిల్లాలో. జిల్లా పరిస్థితుల్ని చూసి… ఈ రాజకీయ వత్తిళ్లు మనం తట్టుకోలేమంటూ వాళ్ళే ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని వెళ్తున్నారా? లేక బలవంతపు బదిలీలు జరుగుతున్నాయా అంటూ ఎవరికి తగ్గ విశ్లేషణలు వాళ్ళు చేసేసుకుంటున్నారు.

పైగా…. బదిలీ అయిన ముగ్గురు కలెక్టర్లు పరిపాలన పరంగా కావచ్చు.. ఇతరత్రా వ్యవహారాల్లో కావచ్చు ప్రజల్లో తమదైన ముద్ర వేసుకున్నవాళ్లే. జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నవారే. ఈ పరిస్థితుల్లో కొత్త కలెక్టర్‌ దివాకర్ ఎంత కాలం ఉంటారన్న ప్రశ్న కూడ రాజకీయ వర్గాల్లో ఉంది. ఒక కలెక్టర్‌ కనీసం రెండేళ్ళయినా జిల్లాలో పనిచేయకుంటే…పరిపాలనా పరంగా, అభివృద్ది పనుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో… మా జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నారని ఆనందపడాలో లేక వాళ్ళ మధ్య సఖ్యత లేక రెండున్నరేళ్ళలో ముగ్గురు కలెక్టర్లు మారారాని విచారించాలో అర్ధం కావడం లేదని అంటున్నారు ఖమ్మం జనం.