మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద జాతీయ రహదారి 44 (NH-44) పై గురువారం ఒక ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఒక పెద్ద కంటైనర్ లారీలో అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగడంతో కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. దట్టమైన పొగలు, మంటలతో హైవేపై ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
కామారెడ్డి నుండి హైదరాబాద్ వైపు కొత్త కార్ల లోడ్తో వెళ్తున్న ఒక కంటైనర్ లారీ తూప్రాన్ పరిధిలోకి రాగానే ఈ ప్రమాదం జరిగింది. లారీ కేబిన్ భాగం నుండి మొదలైన మంటలు క్షణాల వ్యవధిలోనే కంటైనర్ మొత్తం విస్తరించాయి. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే.. కంటైనర్ లోపల రవాణా అవుతున్న ఎనిమిది సరికొత్త కార్లు మంటల దాటికి పూర్తిగా కాలి బూడిదయ్యాయి.
హైవేపై కంటైనర్ మంటల్లో తగలబడుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో వాహనాలను రోడ్డుపైనే నిలిపివేశారు. దీనివల్ల జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే స్పాట్కు చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.
ప్రాథమిక నివేదికల ప్రకారం, లారీలో జరిగిన షార్ట్ సర్క్యూట్ లేదా ఏదైనా ఇతర సాంకేతిక లోపం (Technical Snag) వల్లే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల విలువైన కొత్త కార్లు నష్టపోయినప్పటికీ.. అదృష్టవశాత్తూ కంటైనర్ డ్రైవర్, క్లీనర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి కిందకు దూకేయడంతో సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
