NTV Telugu Site icon

Kaleshwaram Project:పోలీస్ పహారాలో కాళేశ్వరం

Kaleshwaram

Kaleshwaram

గోదావరి నీళ్ల‌ తరలింపున‌కు సాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులకు నిజామాబాద్ జిల్లాలో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ప్యాకేజీ 21 లో చేపట్టబోయే రిజర్వాయర్ కు భూములు ఇచ్చేందుకు ముప్పు గ్రామాల ప్రజలు ససేమిరా అంటున్నారు.. ప్రాజెక్టు ప‌నుల‌ను పదే పదే అడ్డుకుంటూన్నారు.. పోలీసు బందోబస్తు మధ్య అధికారులు పనులు జరిపిస్తున్నారు.. అయినా ముప్పున‌కు గుర‌వుతున్న గ్రామాల ప్ర‌జ‌లు చానైన చ‌స్తాము.. కానీ రిడిజైన్ తో ప్రాజెక్టు ప‌నులు చేసే ఊరుకునేది లేద‌ని ఆందోళ‌న బాట ప‌ట్టారు.

అధికారులు మాత్రం ప‌నులు కొన‌సాగించేదుకు ముప్పు గ్రామ‌ల ప్ర‌జ‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హించారు. కానీ పబ్లిక్ మీటింగ్ కాస్తా రసాభాసగా మారింది. మంచిప్ప, భైరాపూర్ వద్ద పోలీస్ పహారాలో కాళేశ్వరం రిజర్వాయర్ పనులను మొదలు పెట్టారు అధికారులు. దీంతో తెల్లవారుజామున నుంచే వారిని అడ్డుకునేందుకు వచ్చిన నిర్వాసితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు.

నిజామాబాద్ జిల్లాలోని మంచిప్ప గ్రామం చుట్టూ అడవులతో విస్తరించి ప్రకృతి అందాలకు నిలయంగా ఉంది. ఇన్నాళ్లు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ గ్రామం.. రిజర్వాయర్ నిర్మాణానికి ప్ర‌భుత్వం సిద్ద మ‌వ్వ‌డంతో ముప్పునకు గుర‌వ‌తున్న గ్రామాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక టీఎంసీ సామర్థ్యం కలిగిన రెండు చెరువులను కలుపుతూ రిజర్వాయర్ నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది..

ప్రాణహిత-చేవెళ్ల పథకం కింద ఇప్పటికే ఈ గ్రామం చుట్టూ కాల్వలు తవ్వారు. 21 ప్యాకేజీ కింద గోదావరి జలాలు తరలించేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. స్టోరేజ్ ట్యాంక్ నిర్మించి ఇక్క‌డి నుంచి మంచిప్ప‌, మాసాని చెరువును నింపి నిజాంసాగర్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించారు.

రీడిజైన్‌తోనే సమస్య..

ఇదంతా బాగానే ఉన్నా ప్రాణ‌హిత‌ డిజైన్ మార్చి కాలేశ్వరంతో అనుసంధానం చేసేందుకు కొత్త ప్రణాళిక రూపొందించారు. దీని ప్రకారం ఎస్ఆర్ఎస్పి ఎగువ‌ భాగం నుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా నిజామాబాద్ మండలంలోని చెరువు నింపుతారు. అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా మంచిప్ప‌ చెరువులోకి నీటిని తరలిస్తారు.

అయితే ఈ చెరువును కొండెము చెరువుతో కలిపి మూడున్నర టీఎంసీల సామర్థ్యంనికి పెంచానున్నారు. ఇక్కడి నుంచి 17 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ద్వారా డిచ్‌పల్లి, ధర్పల్లి, జక్రాన్‌పల్లి, భీంగ‌ల్ మీదుగా జగిత్యాల జిల్లాలోని మెట్ ప‌ల్లి వరకు నీటిని అందించాలని నిర్మాణాలు చేపడుతున్నారు. ప్యాకేజీ 21 కింద లక్ష 84 వేల ఎకరాలను చిత్రీకరించనున్నారు. ఇందుకోసం 1,200 ఎకరాల భూమిని సేకరించారు. మరో ఎనిమిది వందల ఎకరాలను అటవీ భూమిని కూడా తీసుకోనున్నారు.

సర్కారు సంప్రదింపులు..

అయితే.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఆధ్వర్యంలో ముంపు గ్రామాల ప్ర‌జ‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.. ఆ సమావేశంలో మా భూములు మాకు కావాలి.. రిడిజైన్ ర‌ద్దు చేయాల‌ని ప్ల‌కార్డులు ప‌ట్టుకుని నిర‌స‌న తెలిపారు.. అయితే రిడిజైన్ ప‌క్క‌న పెట్టిప్రాజెక్టు ప‌నులు పూర్తి చేసేందుకు మీరు ఓప్పు కోవాలని జాయింట్ క‌లెక్ట‌ర్ చంద్ర‌శేఖర్ కోరారు..

అయితే ముంపు గ్రామాల ప్ర‌జ‌లు మాత్రం మీరు రిడిజైన్ ప‌నులు చేయామ‌ని మాకు రాత పూర్వ‌కంగా వ్రాసిస్తేనే ఒప్పుకుంటామ‌న్నారు.. దీంతో స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భించలేదు. ముంపు గ్రామాల ప్ర‌జ‌లు ప్రాణాలు అర‌చెతిలో పెట్టుకుని బిక్కు బిక్కు మంటు చూస్తున్నారు. ఈసమస్యకు ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపుతోందని అనుకునే లోపే పోలీసులు భారీ బందోబ‌స్తు న‌డుమ కాళేశ్వ‌రం రిజ‌ర్వాయ‌ర్‌ ప్రాజెక్టు ప‌నుల‌ను ప్రారంభించింది. దీంతో అక్కడి నిర్వాసితులు ప‌నుల‌ను అడ్డుకునేందుకు రావ‌డంతో వారిని అరెస్ట్ చేశారు. దీంతో అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.