మజ్లిస్ కీలక నేత, తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ద్వేషపూరిత ప్రసంగం కేసులో భారీ ఊరట లభించింది. 2012 డిసెంబర్లో హిందువులను ఉద్దేశించి అక్బర్ తీవ్ర వ్యాఖ్యలుచేశారు. నిజామాబాద్, నిర్మల్లో చేసిన వ్యాఖ్యలపై ఒక వర్గం తీవ్రంగా స్పందించింది. ఆయన పై కేసులు నమోదయ్యాయి. అక్బరుద్దీన్పై రెండు కేసులనూ నాంపల్లి సెషన్స్ కోర్టు బుధవారం నాడు కొట్టవేస్తున్నట్లు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో 2012 డిసెంబర్ నెలాఖరులో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అక్బరుద్దీన్ ప్రసంగించారంటూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 2013లో అక్బరుద్దీన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత బెయిల్ తీసుకుని అక్బరుద్దీన్ బయటకు వచ్చారు. ఆనాటి నుంచి ఈ కేసును నాంపల్లి కోర్టు విచారిస్తుంది.
తాజాగా ఇటీవలే ఈ కేసు విచారణను ముగియడంతో నాంపల్లి కోర్టు ఈ నెల 12న తుది తీర్పు వెలువరించనున్నట్లు తెలిపింది. అయితే మంగళవారం నాడు తీర్పును మరోమారు వాయిదా వేసిన కోర్టు.. బుధవారం నాడు తన తుది తీర్పును వెలువరించింది. ఈ తీర్పులో అక్బరుద్దీన్ ని నిర్దోషిగా పేర్కొన్న కోర్టు.. కేసును కొట్టేస్తున్నట్లుగా వెల్లడించింది.
