ప్రేమ వివాహం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఓ యువకుడిని యువతి తరుపు బంధువులు దాడి చేసి హతమార్చారు. ఈ ఘటన హైదరాబాద్లోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏసీపీ శ్రీధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన ఓ యువకుడు (25), అదే జిల్లా పోతిరెడ్డిపల్లి మండలం మర్పల్లి ఘనపూర్కు చెందిన యువతి (23) ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు. అయితే.. వీరు.. ఇంట్లో వారికి ఈ విషయం తెలిసి పెళ్లి నిరాకరించడంతో.. వారు పారిపోయి.. ఓల్డ్ సిటీ లాల్దర్వాజాలోని ఆర్య సమాజంలో ఈ ఏడాది జనవరి 31న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి చేసుకున్న జంట సరూర్నగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని జీవన సాగుస్తున్నారు. అయితే యువకుడు మలక్పేటలో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు.
అయితే నిన్న రాత్రి 9గంటల సమయంలో దంపతులిద్దరూ బైక్పై వీఎం హోం నుంచి సరూర్నగర్ పోస్టాఫీస్ వైపు వెళుతుండగా.. బైక్పై వచ్చిన దుండగులు బైక్కు అడ్డం వచ్చారు. యువకుడి హెల్మెట్ను తీయించి సెంట్రింగ్ రాడ్తో అతనిపై దాడి చేశారు. దీంతో యువకుడికి తీవ్ర గాయాలై రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. మతాంతర వివాహం నేపథ్యంలో యువతి బంధువులే ఈ పాశవిక హత్యకు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లి జరిగిన నాటి నుంచి కక్ష పెంచుకున్న యువతి సోదరుడు, అతని బావలు కలిసి యువకుడిని హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల యువతి తరఫు బంధువులు తమను వెంబడించడంతో, తమకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ దంపతులు వికారాబాద్, బాలాపూర్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
