Site icon NTV Telugu

Amnesia Pub: బాలిక అత్యాచారం కేసులో వక్ఫ్ బోర్డ్ ఛైర్మ‌న్ కొడుకు

Inmesiapub

Inmesiapub

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా అండ్‌ ఇన్సోమియా పబ్‌ నుంచి బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన కేసులో కీలక మలుపు తిరిగింది. నగరానికి చెందిన ఓ వక్ఫ్ బోర్డ్ ఛైర్మ‌న్ కుమారుడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడితో పాటు పరారీలో ఉన్న మ‌రో ఐదు మందిని గాలిస్తున్న అధికారులు సూరజ్, హాదీలను అదుపులోకి తీసుకుని ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. గత నెల 28న బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 14లో నివసించే రుమేనియా దేశానికి చెందిన బాలిక (16) ఓ పార్టీకి హాజరయ్యేందుకు తన ఇంటి సమీపంలో ఉండే హాదీతో కలిసి ఆయన బెంజ్‌ కారులో (టీఎస్‌ 09 ఎఫ్‌ఎల్‌ 6460)లో అమ్నేషియా పబ్‌కు వెళ్లింది.

పథకం ప్రకారం అప్పటికే హాదీ స్నేహితుడు సూరజ్‌ పబ్‌లో ఉన్నాడు. పార్టీ ముగిసిన తర్వాత తిరిగి వచ్చే సమయంలో తానంతట తాను వెళ్లిపోతానని బాలిక చెప్పినా వినిపించుకోని హాదీ, సూరజ్‌ బలవంతంగా కారులో ఎక్కించుకుని బయలుదేరారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె కేకలు పెట్టేందుకు యత్నించగా సూరజ్, హాదీలతో పాటు మరో యువకుడు బెంజ్‌ కారును అక్కడే ఉంచి ఇన్నోవా కారులో బాలికను బలవంతంగా కూర్చొబెట్టుకుని పబ్‌ వద్దకు తీసుకువచ్చి వదిలి వెళ్లారు.

ఇంటికి వెళ్లిన బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు హదీ, సూరజ్‌లతో పాటు మరో ముగ్గురు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పబ్‌ నుంచి వెళ్లిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో ఆ కారులో ఓ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నట్లు తేలింది. అక్కడే వదిలేసిన బెంజ్‌ కారును తీసుకువచ్చి సీజ్‌ చేశారు. అయితే.. పబ్‌లోకి బాలికను ఎలా అనుమతించారనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోపక్క నిందితుల్లోనూ ముగ్గురు మైనర్లుగా తెలుస్తోంది.

Exit mobile version