NTV Telugu Site icon

MLA Jagga Reddy: రాజకీయ హత్యలు చేసిన ఘనత బీజేపీది

Mla Jagga Reddy Satyagraha

Mla Jagga Reddy Satyagraha

MLA Jagga Reddy Satyagraha Deeksha Against ED Cases: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై ఈడీ కేసులకు నిరసనగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై విరుచుకుపడ్డారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీని దూరం చేయడమే బీజేపీ ప్లాన్ అని, అందుకే కావాలని కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. గుజరాత్‌లో అమిత్ షా, ప్రధాని మోదీ క్రిమినల్ కేసులున్నాయని.. కానీ కాంగ్రెస్‌లో ఉన్న వారు క్రిమినల్స్ కాదని అన్నారు. మోదీ, అమిత్ షా రాజకీయ, మత హత్యలు చేయించారని.. రాజకీయ హత్యలు చేసిన ఘనత బిజెపిది అని ఆరోపించారు.

అన్ని శాఖలను అదుపులో పెట్టుకొని, కాంగ్రేస్‌పై బీజేపీ కుట్ర పన్నుతోందని జగ్గారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని ప్రజల మధ్యకు వెళ్లకుండా.. ఈడీ ఆఫీస్‌ల చుట్టూ తిప్పాలని బిజెపి ప్లాన్ చేస్తోందన్నారు. చిన్న చిన్న కారణాలతో సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఇబ్బంది పెడుతున్నారని.. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా అడ్డదారులు తొక్కుతోందని ఆగ్రహించారు. ఈ విచారణకు నిరసనగా శాంతియుతంగా ధర్నా చేస్తుంటే.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీలను అరెస్ట్ చేస్తున్నారని.. ఇది నిజంగా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నేషనల్ హెరాల్డ్ పత్రికతో బీజేపీకి ఏం సంబంధం ఉందని ఆయన నిలదీశారు. ఆ పత్రిక స్వాతంత్రం కోసం పని చేసిందని.. అప్పట్లో బ్రిటీష్ వాళ్లు ఏం చేస్తున్నారన్న విషయాల్ని, రహస్యాల్ని యావత్ దేశానికి ఆ పత్రిక తెలియజేసిందని పేర్కొన్నారు.

అలాంటి చరిత్ర కలిగిన ఈ పత్రికలో కామ, ఫుల్‌స్టాప్స్ లేకపోయినా.. వాటిని తప్పుగా ఈడీ చూపిస్తోందని జగ్గారెడ్డి వెల్లడించారు. 75 సంవత్సరాల తర్వాత ఈడీ కేసు నమోదు చేయడం హాస్యాస్పదమన్నారు. ఇంతకుముందు రాహుల్ గాంధీని, ఇప్పుడు సోనియా గాంధీని గంటల తరబడి ఈడీ ప్రశ్నిస్తోందని.. ఇది ఏమాత్రం సబబు కాదని నిలదీశారు. సోనియా, రాహుల్ సామాన్య పౌరులుగా జీవితం గడుపుతున్నారని.. గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. సైనికుల్లాగా తామంతా పని చేస్తామని జగ్గారెడ్డి చెప్పారు.