నేటి తరం యువతలో సోషల్ మీడియా పిచ్చి ప్రాణాల మీదకు తెస్తోంది. కేవలం లైకులు, కామెంట్ల కోసం చేసే సాహసాలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ గాంధీ బొమ్మ బస్తీలో రీల్స్ చేస్తూ ఓ మైనర్ బాలుడు మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
బీహార్కు చెందిన మితున్ (14) అనే బాలుడు తన బంధువులతో కలిసి మల్లాపూర్ బస్తీలో నివసిస్తున్నాడు. ఈ నెల 5వ తేదీన భవనం పై అంతస్తులో నిలబడి సోషల్ మీడియా కోసం రీల్స్ చేస్తున్న క్రమంలో, ప్రమాదవశాత్తు పట్టుతప్పి కింద పడిపోయాడు. బాలుడు భవనం పైనుంచి ఒక్కసారిగా కిందపడటాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన మితున్, గత కొన్ని రోజులుగా మృత్యువుతో పోరాడి.. చివరకు రెండు రోజుల క్రితం పరిస్థితి విషమించడంతో కన్నుమూశాడు. బాలుడు భవనం పైనుంచి కింద పడుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న సిసిటివి (CCTV) కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాలు చూస్తుంటే రీల్స్ కోసం ఎంతటి ప్రమాదకర స్థితిలో నిలబడ్డారో అర్థమవుతోంది.
పోస్ట్ మార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని బంధువులు తమ స్వస్థలమైన బీహార్కు తరలిస్తున్నారు. కళ్ల ముందే ఆడుకోవాల్సిన పిల్లాడు ఇలా క్షణికావేశంలో చేసిన పనికి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియా రీల్స్ కోసం ఎత్తైన భవనాలు, నదులు, రైలు పట్టాల వంటి ప్రమాదకర ప్రాంతాల్లో సాహసాలు చేయవద్దని పోలీసులు , సామాజిక కార్యకర్తలు పదే పదే హెచ్చరిస్తున్నారు. మీ ఒక్క క్షణం అజాగ్రత్త కుటుంబంలో తీరని శోకాన్ని మిగులుస్తుంది.
Canada Bill C-12: ఇండియన్స్ టార్గెట్గా కెనడా కొత్త రూల్స్? ఇక అంతే సంగతులు!
