Former OSD Sumanth : రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ (OSD) సుమంత్ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. గతంలోనూ పలు వివాదాల్లో నిలిచిన ఆయనపై తాజాగా హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో హత్యాప్రయత్నం కేసు నమోదైంది. ఓ వ్యాపారిపై దారుణంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనలో పోలీసులు ఆయనపై భారతీయ నశిత్ సంహిత సెక్షన్ 109 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.
డెన్కు పిలిపించి రూ.10 కోట్లు డిమాండ్
పోలీసులకు అందజేసిన ఫిర్యాదు ప్రకారం.. సుమంత్ ఓ వ్యాపారిని తన డెన్కు పిలిపించి, ఏకంగా రూ.10 కోట్లు ఇవ్వాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ఆ వ్యాపారి అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడానికి స్పష్టంగా నిరాకరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన సుమంత్, అతని అనుచరులతో కలిసి వ్యాపారిపై దాడికి దిగారు. ఇనుప రాడ్లతో దారుణంగా కొడుతూ, ప్రాణాలు తీస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు బాధితుడు ఆరోపించారు.
గొంగిడి హరికృష్ణ ఫిర్యాదుతో దర్యాప్తు వేగవంతం
ఈ దారుణ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు గొంగిడి హరికృష్ణ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. హరికృష్ణ ఫిర్యాదు ఆధారంగా స్పందించిన పోలీసులు, మాజీ ఓఎస్డీ సుమంత్పై హత్యాప్రయత్నం కేసు నమోదు చేశారు. వరుస వివాదాలు, వసూళ్ల ఆరోపణలతో ఇప్పటికే వార్తల్లో నిలిచిన సుమంత్పై ఇప్పుడు ఏకంగా అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు కావడం రాజకీయ, వ్యాపార వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నారు.

