హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ నిర్మూలనే ధ్యేయంగా కఠిన చర్యలు తీసుకుంటున్న పోలీసులకు మరో భారీ విజయం లభించింది. మెహదీపట్నం పరిధిలో గోల్కొండ టాస్క్ఫోర్స్ , స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో భారీగా ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ కేసులో ఒక ప్రధాన డ్రగ్ పెడ్లర్, ముగ్గురు సబ్ పెడ్లర్లతో పాటు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న నలుగురు వినియోగదారులను పోలీసులు రాత్రికి రాత్రే అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి దాదాపు రూ. 26.80 లక్షల విలువైన 137.60 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, ఒక విలాసవంతమైన వోల్వో XC90 కారు, 9 మొబైల్ ఫోన్లు, ప్యాకింగ్ మెటీరియల్ , ఎలక్ట్రానిక్ వేయింగ్ మెషిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ ముఠా డ్రగ్స్ సరఫరా కోసం అనుసరిస్తున్న విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు బాలానగర్ కేంద్రంగా నెట్వర్క్ నడుపుతూ, ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు రాపిడో , జొమాటో డెలివరీ బాయ్స్ పేరుతో ఈ డ్రగ్స్ దందాను సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఒక గ్రాము ఎండీఎంఏను రూ. 2,000 నుండి రూ. 3,000 వరకు విక్రయిస్తున్నట్లు తేలింది. కాగా, ఈ ముఠా ప్రధాన నిందితుడికి గతంలో చిలకలగూడ డ్రగ్స్ కేసులో అరెస్టైన సాయి నిఖిల్తో బలమైన సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో స్పష్టమైంది. పట్టుబడిన నిందితులందరిపై ఎన్డీపీఎస్ (NDPS) యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ డ్రగ్స్ నెట్వర్క్ వెనుక ఉన్న మరికొందరి ఆచూకీ కోసం విచారణను మరింత వేగవంతం చేశారు.
