Medak: మద్యం షాపులో దొంగతనానికి వచ్చిన దొంగ.. కిక్కులో ఏం చేశాడంటే..?

  • మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి నిద్ర పోయిన దొంగ
  • నార్సింగ్‌లోని కనకదుర్గ వైన్స్ లో ఘటన
  • ఆదివారం రాత్రి వైన్ షాపు మూసేసి ఇంటికి వెళ్లిన యజమాని
  • దొంగతనానికి వచ్చి కౌంటర్ లో నగదు, మద్యం బాటిళ్లు ఓ సంచిలో మూట కట్టుకున్న దొంగ
  • దొంగతనం తర్వాత వెళ్ళేటప్పుడు మద్యం తాగడంతో మత్తులోనే నిద్రపోయిన వైనం.
Medak Thief

Medak Thief

డబ్బుల కోసం ఓ మద్యం షాపులోకి దొంగతనానికి వెళ్లిన దొంగకు.. అక్కడ మద్యం బాటిళ్లను చూసే సరికి తాను వచ్చిన పనిని మొత్తం మరిచిపోయాడు. డబ్బులు కొట్టేయడానికి వచ్చిన ఆ దొంగకు మందు సీసాలే ఎక్కువనుకున్నాడు. ఇంకేముంది.. పీకలకాడికి తాగేశాడు. ఆ తర్వాత సోయి తప్పి పడుకున్నాడు. ఉదయం రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో జరిగింది.

Read Also: Maharashtra: క్రికెట్ ఆడుతూ.. గుండెపోటుతో బ్యాట్స్ మెన్‌ మృతి (వీడియో)

వివరాల్లోకి వెళ్తే.. మద్యం షాపులో దొంగతనానికి వచ్చి ఫుల్లుగా మద్యం తాగి వైన్స్ షాప్ లోనే నిద్ర పోయాడు ఓ దొంగ. నార్సింగ్ మండల కేంద్రంలోని కనకదుర్గ వైన్స్ షాపులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎప్పటిలాగే.. ఆదివారం రాత్రి వైన్ షాపు మూసేసి యజమాని ఇంటికి వెళ్లిపోయాడు. అయితే.. రాత్రి దొంగతనానికి వచ్చిన దొంగ.. కనకదుర్గ వైన్స్‌లో పై కప్పు రేకులు తొలగించి అందులో దూరి దొంగతనానికి ప్రయత్నించాడు. దొంగతనం తర్వాత వెళ్ళేటప్పుడు మద్యం తాగడంతో మత్తులోనే నిద్రపోయాడు. సోమవారం ఉదయం వైన్స్ తెరవగా అందులో ఇతర రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి నిద్రపోయి ఉన్నాడు.

Read Also: Hyderabad: సెల్‌ఫోన్ వాడొద్దని మందలించిన తండ్రి.. కూతురు అదృశ్యం

షాప్ యజమాని మాట్లాడుతూ.. దొంగతనానికి వచ్చి కౌంటర్‌లో నగదు, మద్యం బాటిళ్లు ఓ సంచిలో దొంగ మూట కట్టుకున్నాడని తెలిపాడు. అంతేకాకుండా.. సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేశాడని అన్నాడు. ఈ ఘటనపై పోలీసులకి సమాచారం ఇవ్వడంతో దొంగని అదుపులోకి తీసుకుని.. అనంతరం ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు చెప్పాడు. కాగా.. మద్యం తాగిన మత్తులో దొంగతనానికి వచ్చిన సంగతి మర్చిపోయి దుకాణంలోనే పడుకొని సంఘటన మండల కేంద్రంలో హాట్ టాపిక్ గా మారింది.