Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!

  • మల్కాజిగిరిలో 113 స్పా సెంటర్లపై ఏకకాలంలో దాడులు
  • ఇతర రాష్ట్రాల యువతులతో అసాంఘిక కార్యకలాపాలు.. 46 కేసులు నమోదు
  • ప్లేస్ మార్చి మళ్లీ అదే దందా.. గంజాయి సరఫరా వెలుగులోకి
  • భవన యజమానులు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి హెచ్చరిక
Spa Center Raids

Spa Center Raids

Spa Center Raids : మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో స్పా సెంటర్ల ముసుగులో సాగుతున్న వ్యభిచారం, గంజాయి సరఫరా వంటి అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కమిషనరేట్ పరిధిలో ఒకేసారి భారీ ఎత్తున తనిఖీలు (మేజర్ రైడ్స్) నిర్వహించినట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ (సీపీ) సుమతి వెల్లడించారు. ఎస్ఓటీ (SOT) బృందాలతో కలిసి ఏకకాలంలో 113 స్పా సెంటర్లపై ఈ దాడులు చేసినట్లు ఆమె స్పష్టం చేశారు.

ఇతర రాష్ట్రాల యువతులతో అసాంఘిక పనులు.. 46 కేసులు నమోదు

స్పా సెంటర్ల నిర్వాహకులు ఇతర రాష్ట్రాల నుండి యువతులను ఇక్కడికి రప్పించి, వారి చేత బలవంతంగా అసాంఘిక కార్యకలాపాలు చేయిస్తున్నట్లు తమకు పక్కా సమాచారం అందిందని సీపీ తెలిపారు. పట్టుబడిన వారిలో అస్సాం, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ , నార్త్ ఈస్ట్ (ఈశాన్య) రాష్ట్రాలకు చెందిన యువతులు ఉన్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన నిర్వాహకులపై ఇప్పటివరకు 46 క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఆమె వివరించారు.

×
×
Ad

ఈ స్పా సెంటర్లు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. నిబంధనల ప్రకారం వచ్చే కస్టమర్ల వివరాలను రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉండగా, ఇక్కడ ఎలాంటి కస్టమర్ రికార్డులను నిర్వహించడం లేదని పోలీసులు గుర్తించారు.

ప్లేస్ మార్చి మళ్లీ అదే దందా.. గంజాయి సరఫరా కూడా

నిర్వాహకుల తీరుపై సీపీ సుమతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేసులు నమోదైనప్పటికీ కొంతమంది నిర్వాహకులు బుద్ధి మార్చుకోకుండా.. కేవలం తమ స్థలాలను (ప్లేస్) మార్చి వేరే ప్రాంతాల్లో మళ్లీ ఇవే అసాంఘిక పనులకు పాల్పడుతున్నట్లు ఆమె మండిపడ్డారు. ఇలాంటి ‘రిపీట్ అఫెండర్స్’ (పదే పదే నేరాలకు పాల్పడేవారు) 8 మందిని గుర్తించినట్లు తెలిపారు. అంతేకాకుండా, కొన్ని చోట్ల స్పా సెంటర్ల ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి సప్లై (సరఫరా) కూడా జరుగుతోందని దర్యాప్తులో వెల్లడైందన్నారు.

ఇళ్ల యజమానులకు సీపీ హెచ్చరిక

ఈ సందర్భంగా స్పా సెంటర్లకు తమ భవనాలను అద్దెకు ఇచ్చే ఓనర్లకు సీపీ సుమతి కీలక సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు. భవన యజమానులు కేవలం అద్దె డబ్బుల కోసమే కాకుండా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. తాము అద్దెకు ఇచ్చిన ప్రాంగణంలో ఎలాంటి యాక్టివిటీ జరుగుతోంది, నిర్వాహకులు ఏం చేస్తున్నారు అనే విషయాలను నిరంతరం పర్యవేక్షించి తెలుసుకోవాలని సూచించారు. కమిషనరేట్ పరిధిలో ఇలాంటి అక్రమ ధందాలు నిర్వహిస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.