గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. మధుసూదనాచారి చేత శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన మధుసూదనాచారికి మంత్రులు, పలువురు టీఆర్ఎస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. 1982లో తెలుగుదేశంలో పార్టీలో చేరిన మధుసూదనాచారి.. 1994-99 మధ్య కాలంలో శాయంపేట నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంటే ఉన్నారు. టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో మధుసూదనాచారి ఒకరు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నూతన రాష్ట్ర శాసనసభ స్పీకర్గా బాధ్యతలు నిర్వహించారు. 2018 ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మధుసూదన చారిని కేబినేట్లోకి తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదని పలువురు పార్టీ నాయకులు పేర్కొన్నారు.
ఈ కింది వార్తను చదవండి:
