గాంధీ భవన్ వేదికగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం ఉత్సాహవంతంగా సాగుతోంది.. ఈ కార్యక్రమంలో మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్… అనేక విషయాలను ప్రస్తావించారు.. కేసీఆర్ సర్కార్ అన్ని విధాలుగా విఫలం అయ్యిందని మండిపడ్డ ఆయన.. మరోవైపు బీజేపీపై కూడా విమర్శలు చేశారు.. ఇక, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై తీవ్రంగా స్పందించారు.. ముఖ్యంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పేర్లను ప్రస్తావించిన ఆయన.. కాంగ్రెస్ బిక్షతో సుధీర్రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు.. కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే అయ్యింది కూడా కాంగ్రెస్ పార్టీ వల్లే అన్నారు.. సుధీర్ రెడ్డి ఇప్పుడు కోట్లకు ఎలా పడగలెత్తాడని ప్రశ్నించిన ఆయన.. నీ బండారం బయట పెడతామని హెచ్చరించారు.
మరోవైపు మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మధుయాష్కీ… మహిళ అని కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేసిందన్న ఆయన.. కానీ, సిగ్గు లేకుండా పార్టీ మారారంటూ ఫైర్ అయ్యారు.. రాహుల్ గాంధీ దయతో మంత్రి అయ్యి.. పార్టీ మారేందుకు సిగ్గు ఉండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మధు యాష్కీ.. ఇక, కాంగ్రెస్ కార్యకర్తలపై చేయి వేస్తే చేతులు విరగ్గొడతాం అని హెచ్చరించారు మాజీ ఎంపీ.. కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటానన్న ఆయన… నేను ప్రచార కమిటీ చైర్మన్ కాదు.. సామాన్య కార్యకర్తను అని వ్యాఖ్యానించారు.