NTV Telugu Site icon

యాచారంలో టెన్షన్‌ టెన్షన్.. 33 కేవీ విద్యుత్‌ టవర్లు కూల్చివేత..!

Thakkallapalli

Thakkallapalli

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తక్కళ్లపల్లిలో ఉద్రిక్త నెలకొంది… అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ టవర్లను కూల్చివేశారు స్థానికులు.. నిన్న పోలీస్ బందోబస్తు మధ్య 33 కేవీ విద్యుత్ టవర్లను ఏర్పాటు చేశారు అధికారులు.. అయితే, ఇవాళ పెద్ద ఎత్తున తరలివచ్చిన తక్కళ్లపల్లి గ్రామస్తులు, మహిళలు… ఆ టవర్లను కూల్చివేశారు.. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. కాగా.. కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలోని అమెజాన్ సంస్థ కోసం విద్యుత్ టవర్లు ఏర్పాటు చేశారు.. తక్కళ్లపల్లి పవర్‌ప్లాంట్ నుంచి అమెజాన్‌ సంస్థకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు.. విద్యుత్ టవర్ల ఏర్పాటుపై ఆదినుంచి అభ్యంతరం చెబుతూనే ఉన్నారు తక్కళ్లపల్లి గ్రామస్థులు.. తమ గ్రామం మీదుగా 33 కేవీ లైన్లు వేయొద్దని విజ్ఞప్తి చేశారు.. అయినా, అధికారులు వెనక్కి తగ్గకపోవడంతో… ఇవాళ విద్యుత్ టవర్లు కూల్చివేసేందుకు పూనుకున్నారు మహిళలు, స్థానికులు.. పోలీసులు వారిని వారించేందుకు యత్నించగా.. వారితో వాగ్వాదానికి దిగారు.. దీంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులకు యాచారం ఎంపీపీ మద్దతు తెలిపారు.