Sanjush : మాదాపూర్ ఇన్ఆర్బిట్ మాల్ వద్ద జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన లైఫ్స్టైల్ స్టోర్ ఉద్యోగిని భారతి ముఖి (26) దుర్మరణం చెందారు. అతివేగంగా వచ్చి ఢీకొట్టిన కారును జనసేన ఎంపీ లింగంనేని రమేష్ కుమారుడు సంజుష్ నడుపుతున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 106(1) కింద కేసు నమోదు (Crime No. 1238/2026) చేసి దర్యాప్తు ప్రారంభించారు.
భోజన విరామం ముగించుకుని వస్తుండగా ప్రమాదం
ఆగస్టు 16న మధ్యాహ్నం వేళ లైఫ్స్టైల్ స్టోర్లో సేల్స్ గర్ల్స్గా పనిచేస్తున్న భారతి ముఖి, పూజా అశోక్ భోజనం కోసం ఐటీసీ కోహినూర్ సమీపానికి వెళ్లారు. భోజనం ముగించుకుని తిరిగొస్తూ ఇన్ఆర్బిట్ మాల్ వద్ద రోడ్డు దాటుతుండగా TG-09-G-0666 నంబరు గల కారు వేగంగా, నిర్లక్ష్యంగా దూసుకొచ్చి భారతి ముఖిని బలమైన దెబ్బతీసింది. తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో వెంటనే ఆమెను జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
సీసీటీవీల పరిశీలన.. విచారణ వేగవంతం
సహోద్యోగి పూజా సమాచారంతో స్టోర్ మేనేజర్ పంజల అశ్విన్ కుమార్ ఆస్పత్రికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. ప్రమాద సమయంలో కారును సంజుష్ నడుపుతున్నట్లు తేలడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతివేగంగా వాహనం నడిపి యువతి మృతికి కారణమైనందున సంజుష్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం పోలీసులు కారు వేగం, ప్రమాద దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, రోడ్డు పరిస్థితులు , ప్రత్యక్ష సాక్షుల ఆధారాలను పరిశీలిస్తున్నారు. విధులు నిర్వహిస్తూ సాధారణ భోజన విరామానికి వెళ్లిన యువతి క్రూర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో సహోద్యోగులు, కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

