KTR : ఉపఎన్నికలే కాంగ్రెస్‌కు గుణపాఠం

  • షేక్‌పేటలో పర్యటించిన కేటీఆర్.. ఇంటింటికీ బకాయి కార్డుల పంపిణీ
  • “కాంగ్రెస్‌ గ్యారంటీలన్నీ మోసం” అంటూ కేటీఆర్ ఆరోపణలు
  • ఉపఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్న కేటీఆర్
  • జూబ్లీహిల్స్‌ ప్రచారంలో టూరిస్టు మంత్రులపై ఎద్దేవా
Ktr

Ktr

KTR : భారత రాష్ట్ర సమితి (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (కల్వకుంట్ల తారక రామారావు) కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌ పరిధిలోని షేక్‌పేట ప్రాంతంలో పర్యటించిన ఆయన, ప్రజలతో కలసి ప్రత్యేక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా “కాంగ్రెస్‌ బకాయి కార్డు” అనే వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టారు. కేటీఆర్‌ తన బృందంతో కలిసి ఇంటింటికీ వెళ్లి బకాయి కార్డులను అందజేశారు. వాటిలో ప్రతి వర్గానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంత బాకీ ఉందో, ఏ ఏ వాగ్దానాలు నెరవేర్చలేదో స్పష్టంగా వివరించారు. ఈ కార్డుల ద్వారా కాంగ్రెస్‌ చేసిన మోసాలను, అసత్య వాగ్దానాలను ప్రజలకు తెలియజేయడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్‌ మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు అన్నీ మోసమే. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మాట తప్పుతున్నారు. బకాయి కార్డుల ద్వారా మేము ఈ మోసాన్ని బయటపెడతాం” అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ అహంకారానికి, వాగ్దానభంగానికి గుణపాఠం చెప్పే అవకాశం ఉపఎన్నికలు, స్థానిక ఎన్నికలు రూపంలో వచ్చాయని కేటీఆర్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తప్పక ఓటమి చవి చూడాల్సిందేనని హెచ్చరించారు.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చేవారిని కేటీఆర్‌ “టూరిస్టు మంత్రులు” అంటూ ఎద్దేవా చేశారు. “ఎన్నికలు ముగిసిన వెంటనే ఆ మంత్రులు, సామంతులు అందరూ గాయబ్‌ అయిపోతారు. ప్రజల సమస్యలు ఎవరికీ పట్టవు” అని విమర్శించారు. తమ పక్షాన ప్రజాభిప్రాయం బలంగా మారుతోందని, కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రజల తీర్పు త్వరలోనే స్పష్టమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.