Kishan Reddy : అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

  • అసదుద్దీన్ వ్యాఖ్యలు చట్ట విరుద్ధమన్న కిషన్ రెడ్డి
  • పాస్‌పోర్ట్, పౌరసత్వానికి తేడా వివరించిన కేంద్ర మంత్రి
  • 1967 చట్టాన్ని గుర్తు చేసిన కిషన్ రెడ్డి
  • కోర్టు తీర్పులతో సమాధానం.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు
Kishan Reddy

Kishan Reddy

Kishan Reddy : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భారత పాస్‌పోర్టులు, పౌరసత్వంపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు చట్టపరంగా తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక ప్రజాప్రతినిధిగా, న్యాయవాదిగా ఉన్న అసదుద్దీన్‌కు పాస్‌పోర్టుకు, పౌరసత్వానికి మధ్య ఉన్న చట్టపరమైన తేడాలు తెలిసి ఉండాలని ఆయన హితవు పలికారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు బాధ్యతాయుతంగా మాట్లాడాలని పేర్కొన్న కిషన్ రెడ్డి.. ప్రజలను తప్పుదారి పట్టించే ముందు అసదుద్దీన్ ఒవైసీ పౌరసత్వ చట్టం–1955, పాస్‌పోర్ట్ చట్టం–1967లను మరోసారి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. అసదుద్దీన్ వ్యాఖ్యలు చట్టంపై ఆయనకున్న అవగాహన లోపాన్ని, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్లో అయోమయం సృష్టించే ప్రయత్నాన్ని సూచిస్తున్నాయని మండిపడ్డారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరణ.. పాస్‌పోర్టు విలువలేనిది కాదు.!

విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఇచ్చిన వివరణను కొందరు తప్పుగా చిత్రీకరిస్తున్నారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. విదేశాంగ శాఖ వివరణ ప్రకారం భారత పాస్‌పోర్టు విలువలేనిదని అర్థం కాదని, పాస్‌పోర్టు ఒక్కటే భారత పౌరసత్వానికి తుది, ఖచ్చితమైన ఆధారం కాదని మాత్రమే ప్రభుత్వం పేర్కొందని ఆయన వివరించారు. భారత పౌరసత్వం అనేది ఎల్లప్పుడూ భారత రాజ్యాంగం , పౌరసత్వ చట్టం–1955 ప్రకారమే నిర్ణయించబడుతుందని స్పష్టం చేశారు.

1967 పాస్‌పోర్ట్ చట్టం ఏం చెబుతోంది?

పాస్‌పోర్ట్ చట్టం–1967 ప్రకారం పాస్‌పోర్టు అనేది ప్రధానంగా విదేశీ ప్రయాణాల కోసం ఉపయోగించే ఒక పత్రం (Travel Document) మాత్రమేనని కేంద్ర మంత్రి తెలిపారు. ఆ చట్టంలోని సెక్షన్ 20 ప్రకారం.. ప్రజాహితం దృష్ట్యా భారత పౌరుడు కాని వ్యక్తికి కూడా కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్టు లేదా ట్రావెల్ డాక్యుమెంట్‌ను జారీ చేసే ప్రత్యేక అధికారాన్ని కలిగి ఉంటుందని గుర్తుచేశారు. గతంలో కూడా ఇటువంటి ప్రత్యేక సందర్భాలు ఉన్నాయని, అందువల్ల పాస్‌పోర్టును మాత్రమే పౌరసత్వానికి తుది ప్రాతిపదికగా పరిగణించలేమని చెప్పారు. ఇది ఇప్పటికప్పుడు తెచ్చిన కొత్త నిబంధన కాదని, 1967లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఈ చట్టం అమల్లోకి వచ్చిందని తెలిపారు. దాదాపు 60 ఏళ్లుగా అమల్లో ఉన్న చట్టపరమైన అంశాన్ని ఇప్పుడు మోదీ ప్రభుత్వంపై నెట్టడం అవగాహన లోపమో, లేదా వాస్తవాలను దాచిపెట్టే కుట్రో అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోర్టుల తీర్పులు.. పౌరసత్వ నిర్ధారణ ఇలా..

పౌరసత్వ చట్టం–1955 ప్రకారం ఒక వ్యక్తికి భారత పౌరసత్వం అనేది జననం, వంశపారంపర్యం, నమోదు లేదా నేచురలైజేషన్ (సహజీకరణ) ప్రక్రియల ద్వారా మాత్రమే లభిస్తుందని కిషన్ రెడ్డి వివరించారు. గతంలో 2013లో బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ.. పాస్‌పోర్టు, జనన ధృవీకరణ పత్రం వంటి పత్రాలు మాత్రమే పౌరసత్వాన్ని నిరూపించడానికి పూర్తిగా సరిపోవని న్యాయస్థానం స్పష్టం చేసిందని, దేశంలోని ఇతర హైకోర్టులు కూడా ఇదే సూత్రాన్ని అనుసరించాయని గుర్తుచేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎలాంటి కొత్త విధానాన్ని లేదా నిబంధనను ప్రకటించలేదని, దేశ చట్టాలు, న్యాయస్థానాలు ఇప్పటికే స్పష్టం చేసిన పాత అంశాన్నే మరోసారి పునరుద్ఘాటించిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.