FCRA Bill: విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లుపై ఇటీవల అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రిలీ మూర్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. FCRA బిల్లు తమ అంతర్గత విషయమని స్పష్టం చేసింది. చట్టాల రూపకల్పన పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, విదేశీ నిధుల నియంత్రణకు అమెరికాతో పాటు అనేక దేశాల్లో కూడా ప్రత్యేక చట్టాలు ఉన్నాయనే విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) స్పష్టం చేసింది.
అమెరికా వెస్ట్ వర్జీనాయాకు చెందిన రిపబ్లికన్ ఎంపీ రీలి మూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదయమ్యాయి. ఆయన FCRA సవరణ బిల్లును విమర్శించారు. ఈ బిల్లు క్రైస్తవ సంస్థలపై ప్రత్యక్ష దాడితో సమానమని, ఇది భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విదేశీ నిధుల నియంత్రణకు చట్టపరమైన వ్యవస్థలు ఉన్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
ఎన్డీయే ప్రభుత్వం తీసుకురాబోతున్న FCRA సవరణ బిల్లు భారత్తో పాటు అమెరికాలో సంచలనంగా మారింది. ఈ బిల్లు ద్వారా విదేశాల నుంచి ఎన్జీవోలకు, ఇతర స్వచ్చంద సంస్థలకు వచ్చే నిధులపై జవాబుదారీతనం మరింత పెరుగుతుంది. నిధులు ఎందుకు వచ్చాయి.? ఎక్కడ ఖర్చు చేశారు? ఏ పని కోసం వినియోగించారు? అనే వివరాలను కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా కోరుతుంది. ఒక వేళ అవకతవకలకు పాల్పడితే FCRA రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారంతో పాటు, ఆ నిధుల్ని స్వాధీనం చేసుకునే అధికారాలు ఈ బిల్లు ద్వారా ప్రభుత్వానికి సంక్రమిస్తాయి. ముఖ్యంగా, మతమార్పిడి, ఉగ్రవాదం, దేశ సార్వభౌమత్వ, ప్రజాస్వామ్య వ్యవస్థలు, ప్రజా భద్రతపై ప్రతికూల ప్రభావం పడకుండా చూడటమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం.

