HYDRA Ranganath: ఎన్టీవీ నిర్వహించిన ‘క్వశ్చన్ అవర్’ కార్యక్రమంలో పాల్గొన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలు కీలక విషయాలపై స్పష్టతనిచ్చారు. తాను ఎప్పుడూ చట్టపరిధిలోనే పనిచేశానని, ఎలాంటి కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఏమాత్రం లేదని, మెగా ఫ్యామిలీతో తనకు దాదాపు 15 ఏళ్ల పరిచయం ఉందని తెలిపారు. తాను ఎలాంటి కులసంఘాల సమావేశాల్లోనూ పాల్గొనలేదని స్పష్టం చేస్తూ, తనకు సొంత ఇమేజ్ కంటే ప్రభుత్వ ప్రతిష్టే ము ముఖ్యమని వ్యాఖ్యానించారు. గడిచిన రెండేళ్ల కాలంలో హైడ్రా సంస్థ వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి కాపాడిందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
హైడ్రా అనేది ప్రజల ఆస్తులను కాపాడడానికే తప్ప పేదల ఇళ్లను కూల్చడానికి కాదని, కేవలం కబ్జాదారుల పని పట్టడానికే దీనిని ఏర్పాటు చేశారని రంగనాథ్ వివరించారు. హిట్లర్ స్ఫూర్తిపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల సందర్భం వేరని, బయట జరిగిన ప్రచారం వేరని ఆయన పేర్కొన్నారు. ఫాతిమా కాలేజీ చెరువు పరిధిలో లేదని స్పష్టం చేస్తూ, ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో పేదల ఇళ్లను కూల్చాల్సి వస్తే వారికి ముందే ప్రత్యామ్నాయ వసతి చూపించిన తర్వాతే ఆ పని చేస్తామని హామీ ఇచ్చారు.

