Site icon NTV Telugu

వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి చేయాలి: చిరంజీవి

హైదరాబాద్ అమీర్ పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన యోధ లైఫ్ లైన్ డయాగ్నస్టిక్ సెంటర్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అవ్వాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తవుతుంది.

Read Also: విమాన ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కేంద్రమంత్రి.. ప్రధాని ప్రశంసలు

అయ్యప్ప స్వామి సాక్షిగా వెంకయ్యనాయుడు భారత రాష్ట్రపతి కావాలని… ఉపరాష్ట్రపతిగా ఆయన దేశానికి చాలా సేవ చేశారని చిరంజీవి అభిప్రాయపడ్డారు. తెలుగువారికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది ఎన్టీఆర్ గారు అని.. ఆ తర్వాత స్థానం వెంకయ్యనాయుడిదే అన్నారు. హైదరాబాద్ వాసులకు యోధ లైఫ్ లైన్ వంటి డయాగ్నస్టిక్ సెంటర్ అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. మరోవైపు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ… ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలని ప్రజలకు సూచించారు. మనకు సౌకర్యం కావాలో, సౌందర్యం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని… సౌకర్యంగా ఉంటే ఇల్లు సౌందర్యంగా ఉంటుందని వెంకయ్య తెలిపారు. దేశంలో ఇంకా కొంతమంది వ్యాక్సిన్ వేయించుకోలేదని.. దయచేసి వారు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలని హితవు పలికారు.

Exit mobile version