Site icon NTV Telugu

Cyber Crime Police Crack Down : సైబర్ దొంగలకు షాక్.. కోట్ల రికవరీ ఎలా సాధ్యమైంది..?

Cyber

Cyber

సాంకేతికతను అడ్డుపెట్టుకుని అమాయక ప్రజలను దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లపై హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మెరుపు దాడి చేశారు. మార్చి 2026 నెలలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లలో భాగంగా దేశవ్యాప్తంగా ఐదు వివిధ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి, 13 ప్రధాన కేసులతో సంబంధం ఉన్న 20 మంది నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు. అదనపు పోలీస్ కమిషనర్ (క్రైమ్స్ & SIT) విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఈ నెలలో బాధితులకు సుమారు రూ. 1,59,69,564/- మొత్తాన్ని విజయవంతంగా రీఫండ్ చేయించారు.

హైదరాబాద్ పోలీసులు నిర్వహించిన ఈ అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లో తెలంగాణ నుంచి 15 మంది, కేరళ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్, గోవా, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరిని చొప్పున అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 6.50 లక్షల నగదుతో పాటు 14 మొబైల్ ఫోన్లు, 4 ల్యాప్‌టాప్‌లు, చెక్ బుక్కులు , షెల్ కంపెనీలకు సంబంధించిన స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నిందితులు ప్రధానంగా ఇన్వెస్ట్‌మెంట్, గేమింగ్, మ్యాట్రిమోనియల్ , డిజిటల్ అరెస్ట్ వంటి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.

Pakistan in Crisis: తీవ్ర సంక్షోభంలో పాక్‌.. నూనె లేదు, పిండి లేదు, కరెంట్‌ లేదు.. ఇప్పుడు లాక్‌డౌన్‌..!

మార్చి నెలలో నమోదైన కేసుల్లో ఒక గేమింగ్ మోసం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. ఇన్స్టాగ్రామ్‌లో ఒక ప్రకటన చూసి ఆకర్షితురాలైన ఒక బాధితురాలు, అధిక లాభాల ఆశతో ఒక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుని ఏకంగా రూ. 26.07 కోట్లు నష్టపోయింది. ఈ కేసులో హైదరాబాద్, మేడ్చల్, కేరళ , గోవాకు చెందిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

సైబర్ నేరగాళ్ల చేతిలో డబ్బు పోగొట్టుకున్న వారికి తిరిగి ఇప్పించడంలో హైదరాబాద్ పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మార్చి నెలలో వివిధ కేసుల్లో బాధితులు రూ. 4.40 కోట్లు పోగొట్టుకోగా, బ్యాంకింగ్ రంగంతో సమన్వయం చేసుకుని రూ. 1.59 కోట్లకు పైగా మొత్తాన్ని వెనక్కి రప్పించారు. ముఖ్యంగా డెబిట్ కార్డ్ ఫ్రాడ్ , కస్టమర్ కేర్ ఫ్రాడ్ కేసుల్లో బాధితులు పోగొట్టుకున్న మొత్తాన్ని 100 శాతం తిరిగి ఇప్పించడం విశేషం.

Harish Rao: మాజీ మంత్రి హరీష్‌రావు అరెస్ట్.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఫైర్‌..

ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రారంభించిన ‘సైబర్ సింబా’ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోంది. పోలీస్ కమిషనర్ శ్రీ వి.సి. సజ్జనార్, IPS గారి నేతృత్వంలో సుమారు 500 మంది వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించడం వల్ల రోజువారీ సైబర్ ఫిర్యాదులు 80 నుండి 60కి తగ్గాయని అధికారులు వెల్లడించారు. అలాగే సోషల్ మీడియాలో అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న 129 ప్రొఫైళ్లను గుర్తించి వాటిని తొలగించారు.

ప్రజలకు పోలీస్ అడ్వైజరీ (ముఖ్య సూచనలు):

డిజిటల్ అరెస్ట్ భయం వద్దు: చట్టంలో ‘డిజిటల్ అరెస్ట్’ అనే విధానం లేదు. సీబీఐ, ఈడీ అని భయపెట్టి వీడియో కాల్స్ చేసేవారిని అస్సలు నమ్మకండి.

నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూపులు: టెలిగ్రామ్, వాట్సాప్‌లలో అధిక లాభాలు ఆశచూపే ప్రకటనలను నమ్మి పెట్టుబడులు పెట్టకండి. కేవలం SEBI గుర్తింపు పొందిన యాప్‌లనే వాడండి.

APK ఫైళ్లు: తెలియని వ్యక్తులు పంపే లింకులు లేదా APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేయవద్దు.

తక్షణ ఫిర్యాదు: ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. త్వరగా స్పందిస్తేనే మీ డబ్బును హోల్డ్ చేసే అవకాశం ఉంటుంది.

 

Exit mobile version