ఒక ఇల్లు నిర్మించాలంటే దాని వెనుక ఎంతో కష్టం.. ఎంతో శ్రమ. ఎంతో డబ్బు ఖర్చు ఉంటుంది. ఇక హైదరాబాద్లాంటి మహా నగరంలో ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదు. అనుకున్న బడ్జెట్ దాటిపోతే అప్పో.. సొప్పో చేసి మరి ఇల్లు నిర్మాణం పూర్తి చేస్తారు. ఇలానే ఒక వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు. బంధువులు.. స్నేహితులను పిలిచి గ్రాండ్గా గృహప్రవేశం చేశాడు. అంతా బాగుందనుకుంటున్న సమయంలో కొత్త ఇంటిపై హిజ్రాల కన్నుపడింది. ఇల్లు కట్టుకున్నందుకు డబ్బు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇవ్వలేనని చెప్పిన పాపానికి హిజ్రాల గుంపు మూకుమ్మడి దాడికి పాల్పడింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్-కీసర పరిధిలోని చీర్యాల్లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Bihar Elections: కూటమిలో జోష్.. భారీగా లడ్డూలు సిద్ధం చేస్తున్న కార్యకర్తలు
కీసర పరిధిలోని చీర్యాల్ బాలాజీ ఎన్క్లేవ్లో ఇటీవల సదానందం అనే వ్యక్తి గృహ ప్రవేశం చేశాడు. ఆదివారం ఇద్దరు హిజ్రాలు వచ్చి రూ.1 లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు సదానందం నిరాకరించాడు. దీంతో హిజ్రాలు తిట్టుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటికే రెండు, మూడు ఆటల్లో 15 మంది హిజ్రాల గుంపును వేసుకుని వచ్చి ఘర్షణకు దిగారు. వెళ్లిపోవాలంటూ కుటుంబ సభ్యులు సర్దిచెబుతున్నా వినకుండా కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. సదానందంపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఇరుగుపొరుగు వారు గమనించి దగ్గరకు రాగానే వెంటనే అక్కడ నుంచి పారిపోయారు. కర్రలతో దాడి చేయడంతో సదానందం తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితుడు పోలీసులకు సమాచారం అందించాడు. ఇక ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను డిమాండ్ చేశారు. ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: గోడి మీడియాను నమ్మొద్దు.. సర్వేలపై తేజస్వి యాదవ్ ధ్వజం
