NTV Telugu Site icon

మరో 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత..

రాష్ట్రంలో రోజురోజుకూ మరింత చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా కనిష్టస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతు పడిపోతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

మరో 3 రోజుల పాటు తీవ్ర చలిగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కుమురం భీం జిల్లా గిన్నెధరిలో అత్యల్పంగా 3.5 డిగ్రీలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈశాన్య భారత ప్రాంతాల నుంచి రాష్ట్రం వైపు తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు ఉద్ధృతంగా గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచే శీతల గాలులు వీస్తున్నాయని, ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఏపీలోనూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విశాఖ మన్యంలో చలి తీవ్రత పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కురుస్తుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.