NTV Telugu Site icon

Diwali Special Trains: దీపావళికి 804 ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికుల కోసం UTS మొబైల్ యాప్..

Special Trains

Special Trains

Diwali Special Trains: దీపావళికి ఇంటికి వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌ న్యూస్‌ చెప్పింది. దీపావళి, ఛత్ పండుగలను పురస్కరించుకుని అధికారులు 804 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లలో ప్రయాణించే వారికి.. U.T.S. మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రైల్వే శాఖ కోరింది. గత సీజన్‌లో 626 ప్రత్యేక రైళ్లను నడుపుతుండగా ఈ సీజన్‌లో 178 సర్వీసులను పెంచినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీలకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దీపావళి, ఛత్ పండుగల నేపథ్యంలో అదనపు రైళ్లను నడపాలని నిర్ణయించారు. కాగా.. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి షాలిమార్, రాక్సల్, జయపుర, హిస్సార్, గోరఖ్‌పూర్, షిర్డీ, దానాపూర్, నిజాముద్దీన్, కటక్, అగర్తల, సంత్రాగచ్చిలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

Read also: Kaleshwaram: కాళేశ్వరం అవకతవకలపై నేటి నుంచి మళ్లీ విచారణ..

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పండుగల సందర్భంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. మరోవైపు మదురై, ఈరోడ్, నాగర్‌కోయిల్, కొల్లాం, బెంగళూరు, పన్వెల్, దాదర్ తదితర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ప్రత్యేక రైళ్లలో రిజర్వ్‌డ్‌ కోచ్‌లు, అన్‌రిజర్వ్‌డ్‌ కోచ్‌లు ఉన్నాయని తెలిపింది. మరోవైపు దానా తుపాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే 41 రైళ్లను రద్దు చేసింది. ఈ నెల 23, 24, 25, 27 తేదీల్లో వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ వెల్లడించారు. రద్దయిన రైళ్ల వివరాలను సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. రద్దయిన రైళ్లలో ఎక్కువ భాగం హౌదా, భువనేశ్వర్, ఖరగ్‌పూర్ (పశ్చిమ బెంగాల్), పూరి మరియు ఇతర ప్రాంతాల నుండి ఉన్నాయి.
KTR Testimony: మంత్రి కొండా సురేఖపై కేసులో.. నేడు కేటీఆర్‌ వాంగ్మూలం..