Montha Effect : హైదరాబాద్- శ్రీశైలం రాకపోకలు బంద్..

  • ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో డిండి ప్రాజెక్ట్‌కు పెరిగిన వరద ప్రవాహం
  • దుందుభి నది ఉధృతికి డిండి అలుగు బ్రిడ్జ్‌ దెబ్బతినడంతో రాకపోకలు నిలిపివేత
  • హైదరాబాద్–శ్రీశైలం హైవేపై వాహనాల రాకపోకలకు తాత్కాలిక ఆంక్షలు
  • ప్రాజెక్ట్‌ వద్ద భద్రతా చర్యలు బలోపేతం చేసిన పోలీసులు, ప్రజలకు అప్రమత్తత సూచన
Untitled Design (12)

Untitled Design (12)

Montha Effect : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలోని డిండి ప్రాజెక్ట్‌ వద్ద వరద ఉధృతి పెరిగింది. డిండి ప్రాజెక్ట్‌కు దుందుభి నది నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రవాహం అంతలా పెరగడంతో నది ప్రాజెక్ట్ సమీపంలోని అలుగు బ్రిడ్జిని తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. తీవ్ర ప్రవాహం కారణంగా డిండి అలుగు బ్రిడ్జ్‌లో కొంత భాగం దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌-శ్రీశైలం హైవేపై రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

ప్రస్తుతం అచ్చంపేట‌, హైదరాబాద్‌, శ్రీశైలం మార్గాల్లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాహనదారులు ఆ మార్గంలో ప్రయాణించవద్దని అధికారులు సూచించారు. ప్రాజెక్ట్‌ పరిసరాల్లో పోలీసులు భద్రతా చర్యలను బలోపేతం చేశారు. రహదారి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తున్నారు.

డిండి ప్రాజెక్ట్‌ వద్ద నీటి ప్రవాహం ఇంకా పెరుగుతున్నందున, పరిస్థితిని జిల్లా యంత్రాంగం క్షుణ్ణంగా పర్యవేక్షిస్తోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం రాబోయే గంటల్లో నాగర్‌కర్నూల్‌, నల్లగొండ‌, వనపర్తి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. అధికారులు ప్రజలను జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని హెచ్చరిస్తున్నారు.

Cyclone Montha: మరో 48 గంటలు జాగ్రత్త.. జిల్లా కలెక్టర్లకు మంత్రి నారా లోకేష్‌ కీలక సూచనలు