Electric Buses : రేపు హైదరాబాద్ రోడ్లపైకి 65 ఎలక్ట్రిక్ బస్సులు

  • రేపు హైదరాబాద్ రోడ్లపైకి 65 ఎలక్ట్రిక్ బస్సులు
  • రాణిగంజ్ డిపోలో ప్రారంభించనున్న టీజీఎస్ ఆర్టీసీ
  • హాజరుకానున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్
  • బస్సులను ఆపరేట్ చేయనున్న ఈవీట్రాన్స్..
Tgsrtc

Tgsrtc

హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి, వాతావరణ కాలుష్యానికి పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రజారవాణాను మరింత సౌకర్యవంతంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దే దిశగా నగరంలో కొత్తగా 65 ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి తీసుకురానుంది. ఈ నిర్ణయంతో ప్రయాణికుల అసౌకర్యం తగ్గడంతో పాటు, కాలుష్య నియంత్రణకు కూడా తోడ్పడనుంది.

ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభ కార్యక్రమం బుధవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ బస్సులను ఈవీట్రాన్స్ అనే సంస్థ ఆపరేట్ చేయనుండగా, నిర్వహణ బాధ్యతలను కూడా అదే సంస్థ చేపట్టనుంది.

ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు రూట్లలో ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా సేవలందిస్తున్న విషయం తెలిసిందే. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, రద్దీ తగ్గించేందుకు ఆర్టీసీ విడతల వారీగా కొత్త బస్సులను ప్రవేశపెడుతోంది. తాజా విడతలో భాగంగా తీసుకొస్తున్న 65 ఎలక్ట్రిక్ బస్సులు నగర ప్రజారవాణా వ్యవస్థకు మరింత బలం చేకూర్చనున్నాయి.

IndiGo Flight Cuts: ఇండిగోకు కేంద్రం గట్టి షాక్‌.. 10% విమాన సర్వీసులు కట్ చేస్తూ ఆర్డర్!

ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా డీజిల్ వాహనాలతో పోలిస్తే కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. నగరంలో వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో వాయు కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో, పర్యావరణహిత ప్రజారవాణా విధానాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇదిలా ఉండగా, రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో గ్రీన్ ఎనర్జీపై నిర్వహించిన ప్యానల్ డిస్కషన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2030 నాటికి హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని వెల్లడించారు. అలాగే 2047 నాటికి గ్రీన్ ఎనర్జీ ఆధారిత రవాణా విధానంతో ముందుకు సాగుతామని తెలిపారు.

హైదరాబాద్‌లో జనాభా అధికంగా ఉండటం వల్ల వాతావరణ కాలుష్యం కూడా వేగంగా పెరుగుతోందని, ఈ పరిస్థితిని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజారవాణాను మరింత ఆధునికంగా, ప్రజలకు అనుకూలంగా మార్చడమే లక్ష్యంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.

Sudan War: సూడాన్ రక్తపాతం.. ఆ ముస్లిం దేశం యువరాజులపై తీవ్రమైన ఆరోపణలు!