Telangana Floods : నిండుకుండల్లా జంట జలాశయాలు.. మూసీ పరివాహక ప్రాంతాలకు అలర్ట్..

  • జంట జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి చేరిక
  • హిమాయత్ సాగర్ నుంచి 2,300 క్యూసెక్కుల నీటి విడుదల
  • ఉస్మాన్ సాగర్ నుంచి 2,106 క్యూసెక్కుల నీరు మూసీలోకి
  • పరివాహక ప్రాంత ప్రజలకు అప్రమత్తం చేసిన అధికారులు
Hussain Sagar

Hussain Sagar

Telangana Floods : నిన్నటి నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు జంట జలాశయాలను నిండుకుండలా మార్చాయి. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా చేరుతోంది. చేవెళ్ల, వికారాబాద్, మొయినాబాద్, మోమిన్పేట, చిలుకూరు వంటి మండలాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో జలాశయాలకు గణనీయంగా ఇన్ఫ్లో పెరిగింది. హిమాయత్ సాగర్‌కు ప్రస్తుతం సుమారు 2,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మూడు గేట్లు ఎత్తి, 2,300 క్యూసెక్కుల వరద నీటిని మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో ఉస్మాన్ సాగర్‌లోనూ భారీగా నీరు చేరుతోంది. ఈ జలాశయానికి సుమారు 1,600 క్యూసెక్కుల ఇన్ఫ్లో రావడంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి 2,106 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Siricilla : జలాశయంలో చిక్కుకున్న వారిని కాపాడిన రెస్కూ టీం

దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతున్నది. ఈ క్రమంలో అధికారులు అక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించుకునేలా సూచనలు చేస్తున్నారు. వరదనీటి విడుదల కారణంగా తక్కువ ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని, జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని హెచ్చరించారు. ఇక జంట జలాశయాల్లో వరద నీరు కొనసాగుతున్న పరిస్థితి ఇంకా రెండు రోజుల పాటు కురిసే వర్షాలపై ఆధారపడి ఉండనుంది. వర్షాల తీవ్రత అలాగే ఉంటే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం నగరంలోని జంట జలాశయాల పరిస్థితిని అధికారులు సమీక్షిస్తూ, నిరంతరంగా పర్యవేక్షిస్తున్నారు. వరద నీటిని సురక్షితంగా వదులుతూ, మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు.

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం.. మూడేళ్ల యుద్ధంలో రెండో అతిపెద్ద దాడి